Publish Date: Mon, 21 Mar 2022 (23:55 IST)
Updated Date: Mon, 21 Mar 2022 (23:57 IST)
కోవిడ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా డెల్టాక్రాన్ అనే మ్యూటేషన్ ఒకటి విజృంభిస్తున్నట్లు అర్థమవుతుంది. దీని లక్షణాలు ఇలా వుంటాయంటున్నారు వైద్య నిపుణులు. తలనొప్పి, అధిక జ్వరం, చెమటపోయటం లేదా చలి, గొంతు మంట, వదలని దగ్గు, చెప్పలేనంత అలసట, శక్తి కోల్పోవడం, దీర్ఘకాలిక, విస్తృతమైన శరీర నొప్పులు వంటివి వుంటాయని అంటున్నారు.
ఇదిలావుంటే రాబోయే రెండు నెలల్లో ఎప్పుడైనా నాలుగో కోవిడ్ వేవ్ భారత్ను తాకే అవకాశం వున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా దేశాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జూన్ నెలలో నాల్గవ కరోనా వేవ్ భారతదేశాన్ని తాకే అవకాశం ఉంది.
థర్డ్ వేవ్ ఎఫెక్ట్ భారత్పై పెద్దగా లేదు. భారతదేశంలో మూడో వేవ్ తీవ్రత రేటు తక్కువగా నమోదైంది. అందువల్ల రాబోయే నాలుగో కరోనా వేవ్ ప్రభావం తక్కువగా వుండవచ్చునని అంచనా మాత్రమే. కానీ ఏదిఏమైనా నాలుగో కోవిడ్ వేవ్కు భారత్ సిద్ధంగా ఉండాలని, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
గత రెండు సంవత్సరాల నుండి చైనా కరోనాతో నానా తంటాలు పడిన సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల ద్వారా రోగనిరోధక శక్తి కారణంగా భారతదేశంలో కోవిడ్ స్ట్రెయిన్ తక్కువ ప్రమాదకరంగా ఉండవచ్చు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా భారతదేశం ఇప్పటికే మరొక కోవిడ్ దెబ్బకు సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ తెలిపారు. చాలా మంది ప్రజలు కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోస్లను పూర్తి చేశారని ఆయన చెప్పారు.
సిహెచ్
Publish Date: Mon, 21 Mar 2022 (23:55 IST)
Updated Date: Mon, 21 Mar 2022 (23:57 IST)