Publish Date: Tue, 08 Jul 2014 (19:03 IST)
Updated Date: Tue, 08 Jul 2014 (19:08 IST)
ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రేటు తిరోగమనంతో పాటు దేశానికి ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చిపడింది. దేశవ్యాప్తంగా సుమారు 16 కోట్ల మంది మహిళలు నిరుద్యోగులుగా వున్నారు. 2009-11 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా మొత్తంలో కేవలం 25.63 శాతం మంది మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. 16 కోట్ల మంది మహిళా నిరుద్యోగుల్లో 15 నుంచి 59 సంవత్సరాల వయసు గల మహిళలు కూడా వున్నారు.
సుమారు 45 శాతానికి పైగా మహిళలు గృహిణి బాధ్యతల్లోనే వంటింటికి పరిమితమైపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వీళ్లంతా గృహిణులుగా మిగిలిపోవడానికి ఇంటి నుంచి వచ్చే ఒత్తిడులు, సామాజిక ఒత్తిడులు, ఆచారాలే కారణంగా కనిపిస్తున్నాయి.
మహిళలకు మేలు చేకూర్చే విధంగా ఇంతవరకూ ఆర్థిక విధానాలు రూపొందించకపోవడం కూడా మహిళలు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి కారణమని చెబుతున్నారు. మహిళలు కూడా ఉద్యోగాలు చేయడం వల్ల దేశం ఆర్థికంగా వృద్ది చెందడంతో పాటుగా వ్యక్తిగతంగా కూడా వృద్ధి చెందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మహిళల్లో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉండటానికి నిరక్షరాస్యత కూడా మరో కారణంగా కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల్లో అక్షరాస్యత 85 శాతం వుండగా మహిళల్లో అక్షరాస్యత కేవలం 65 శాతమే.
ఇంత పెద్ద ప్రజాస్వామ్య, అధిక జనాభా కలిగిన రెండో దేశానికి 16 కోట్ల మంది మహిళలు నిరుద్యోగులుగా మిగిలిపోవడం దేశానికి ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళలకు కూడా ఉపాధి కల్పించడం ద్వారా అటు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఇటు పేదరికాన్ని కూడా పారద్రోలవచ్చు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. బహుశా రాజస్థాన్ ప్రభుత్వం ఈ దిశగా తొలి అడుగు వేసిందనే చెప్పాలి.