Publish Date: Wed, 24 Feb 2016 (12:23 IST)
Updated Date: Wed, 24 Feb 2016 (12:25 IST)
మహిళలూ చీటికి మాటికీ కోపపడుతున్నారా? చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతున్నారా? అయితే అతి త్వరలోనే వృద్ధాప్యం తప్పదని తాజా అధ్యయనం తేల్చింది. మహిళలు మూడు పదుల, నాలుగు పదుల వయస్సులోనూ ఆరోగ్యంగా, యవ్వనంతో జీవించాలనుకునే మహిళలు శాంత స్వభావాన్ని అలవర్చుకుంటే సరిపోతుందని తాజా అధ్యయనం తేల్చింది. అయితే అసహనం పాళ్లు ఎక్కువగా ఉన్న మహిళలు వృద్ధాప్యానికి త్వరగా దగ్గరవుతారని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్) పరిశోధకులు అంటున్నారు.
ఈ మేరకు చైనా యువతులను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు వారు వివరించారు. దాదాపు 12 వందల చైనా యువతులను ఎంపిక చేసి వారి సహనాన్ని.. ఆతృతను పరీక్షించే ప్రయోగం చేశారు. ఈ క్రమంలో మహిళలకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రివార్డును మరుసటి రోజు తీసుకునే వారికి వంద డాలర్లే లభిస్తాయని, కొంతకాలం తర్వాత తీసుకునే వారికి ఇంకా ఎక్కువ రివార్డు వస్తుందని పరిశోధకులు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్లో మొదటి రివార్డుకే ఎక్కువమంది మహిళలు ఓటేశారు. మరుసటి రోజు లభించే వంద డాలర్లను పొందేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపారు.
అలాగే ఈ మహిళలపై చేసిన మరికొన్ని పరిశోధనల్లో వీరిలో కణజాల స్థాయిలో వయసు త్వరగా పెరుగుతుండటం గమనించినట్లు తెలిపారు. ఈ వినూత్న అధ్యయనంతో కణజాల పెరుగుదలపై మానసిక ఆలోచనల ప్రభావం ఉంటుందనేది స్పష్టమైందని పరిశోధకులు చెప్తున్నారు.