Publish Date: Fri, 22 Aug 2014 (18:59 IST)
Updated Date: Fri, 22 Aug 2014 (19:01 IST)
వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పురోహితులు అంటున్నారు.
"చతుర్ధీ పూజన ప్రీత:" అంటే వినాయకుని చతుర్ధి పూజంటే ప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితీ గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు.
కానీ అంతకుముందే గణపతి ఉన్నాడు. ఆయన ఉపాసన కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. ఇది తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు.
కాగా.. భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి. ఆ రోజున ఉపవాసం చేసి పూజ తర్వాత 21సార్లు "ఓం శ్రీ గణేశాయ నమ:" అని జపించాలని పురోహితులు చెబుతున్నారు.