Publish Date: Tue, 18 Jul 2023 (13:57 IST)
Updated Date: Tue, 18 Jul 2023 (22:34 IST)
చిన్న పిల్లలకు త్వరగా మాటలు రావడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి సరస్వతి ఆకుతో తయారు చేసే లేహ్యాన్ని తినిపిస్తుంటారు. అయితే సరస్వతీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించడానికి సరస్వతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.
సరస్వతి ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం వ్యాధి గ్రస్తులకు కూడా సరస్వతి ఆకు ఒక దివ్యౌషధమని చెప్పుకోవచ్చు. సరస్వతీ ఆకు మెదడు కణాల వృద్ధికి తోడ్పడతాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అలాంటి సరస్వతీ ఆకుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం..
కావల్సినవి : సరస్వతీ ఆకు - పావు కప్పు, వెల్లుల్లిపాయలు - 2 రెబ్బలు, కొబ్బరి తురుము - పావు కప్పు, ఎండు మిర్చి - 5, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, నూనె - పావు టీస్పూను, ఉప్పు - కావలసినంత.
ముందుగా సరస్వతీ ఆకును శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి సరస్వతీ ఆకు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి తురుము, ఎండు మిర్చి వేసి వేయించి, చల్లారిన తర్వాత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన ఆకుకూర ముద్దలో నిమ్మరసం వేసి కలపాలి.
ఇప్పుడు పోషకమైన, రుచికరమైన సరస్వతీ ఆకు పచ్చడి సిద్ధం. ఈ పచ్చడిలో చింతపండు వేయకుండా వండుకుంటేనే ఆరోగ్యానికి తగిన పోషకాలు అందుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.