Publish Date: Tue, 17 Sep 2019 (12:57 IST)
Updated Date: Tue, 17 Sep 2019 (16:43 IST)
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వచ్చిన ఈ చట్టంతో వాహనచోదకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చట్టంలో పేర్కొన్నట్టుగా భారీ అపరాధం వసూలు చేస్తున్నారు.
మొత్తంమీద కొత్త మోటార్ వాహనాల చట్టం-2019 సామాన్యులకు నరకం చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆటోలో హెల్మెట్ పెట్టుకోలేదనీ, బైక్పై సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు చలానాలు రాస్తుండటంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు.
తాజాగా పొలం వద్ద ఎద్దుల బండి పెట్టుకున్నందుకు పోలీసులు ఓ రైతుకు జరిమానా విధించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్కు చెందిన హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపిఉంచాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు.... హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రూ.1,000 జరిమానాను అందజేశారు. దీంతో తిక్కరేగిన హసన్.. 'అసలు ఎద్దులబండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది?' అంటూ తీవ్రంగా మండిపడ్డాడు.
దీంతో తమ తప్పు తెలుసుకున్న పోలీసులు చలాన్ రద్దుచేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈలోగా ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. దీంతో తప్పు తెలుసుకున్న పోలీసులు... అతను తప్పు చేయలేదని తేలడంతో చలాన్ను వెనక్కు తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.