Publish Date: Mon, 25 Feb 2019 (18:44 IST)
Updated Date: Mon, 25 Feb 2019 (18:48 IST)
కర్నూలు జిల్లాలో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అదే జిల్లాలో రైతులను పరామర్శిస్తోంది. అది కూడా వారికి రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుని టీవీ ఛానెల్ లోగో ఉన్న మైక్ పట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తోంది. గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన రెండు రైతు కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆమె సాక్షి టీవీ యాంకర్ అవతారం ఎత్తి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఓ పక్క పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే రేణు దేశాయ్ కూడా సందడి చేస్తుండటం, అది కూడా సాక్షి టీవీ లోగో పట్టుకుని రైతులను ఇంటర్వ్యూలు చేస్తుండటం వైసీపీ, జనసేన శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. పవన్ తాను కామ్రేడ్లతో తప్ప వేరెవరితోనూ పొత్తు పెట్టుకోబోనని స్పష్టం చేశారు.
అయితే జరుగుతున్న పరిస్థితి ప్రభావాల దృష్ట్యా ఎన్నికలలో హంగ్ వచ్చే పక్షంలో జనసేన, వైకాపాలు రూలింగ్లోకి వచ్చేందుకు ఎవరో ఒకరికి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. దీని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందని కొందరు అనుకుంటున్నారు. మరోపక్క, టీడీపీ, జనసేనలు చేతులు కలపబోతున్నాయని సాక్షి మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.