Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు చేసే నాయకులు వరద బాధితుల కోసం ఆ సొమ్ము తీయాలి: పవన్ కళ్యాణ్

ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు చేసే నాయకులు వరద బాధితుల కోసం ఆ సొమ్ము తీయాలి: పవన్ కళ్యాణ్
, గురువారం, 22 అక్టోబరు 2020 (18:14 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకునే విషయంలో పలు ఆసక్తికర అంశాలు లేవనెత్తారు. ఆయన మాటల్లోనే... "విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం. సమస్య వచ్చినప్పుడు సంరక్షిస్తారనే ప్రభుత్వం అనే వ్యవస్థను ప్రజలు ఎన్నుకున్నారు. వాటన్నిటినీ సక్రమంగా అమలు చేయాల్సింది రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రసీ. ఇలాంటి విపత్కర సమయంలో అధికారం ఎవరి చేతుల్లో వుందో వారే ముందుగా బాధ్యత తీసుకోవాలి. కొన్నిసార్లు అధికారంలో వున్నవారికి కొంత చేయూత అవసరం అవుతుంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా పేరున్నవాళ్లు, సంపన్నులు ప్రభుత్వాలకు అండగా నిలవాలి. రైట్ గవర్నమెంట్ వుంటే చాలా బలంగా అందరూ ముందుకు వస్తారు.
 
అసలు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోవాలి. అందరి ఉమ్మడి డబ్బు అయిన ప్రభుత్వ ఖజానాలోని నిధులను ఇష్టారాజ్యంగా కాకుండా ఇలాంటి విపత్తుల సమయంలో నిజమైన బాధితులకు అందేలా చూడాలి. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని దశాబ్దాలుగా ఆ విధంగా జరగకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాత్ర ఎంత అనే దృష్టి నుంచి వ్యక్తుల మీదకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో మనందరం దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏమిటి... లోటుపాట్లు ఏమిటి, ఆ ప్రభావం కూడా ప్రభుత్వంపై ఎంత పడిందని నిష్పక్షపాతంగా చూడాలి. నేనయితే అలానే చూస్తాను.
 
సినీ రంగానికి పేరు మాత్రమే ఆకాశమంత
చిత్ర పరిశ్రమలో చాలా సంపద వుంటుందని అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో వుంది. విపత్తులు జరిగినప్పుడు సినిమా పరిశ్రమ స్పందిస్తూనే వుంది. విరాళాలు ఇస్తూనే వున్నారు. కానీ సరిపోయినంత ఇవ్వడం లేదనే విమర్శ కూడా వుంది. అసలు సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించేది ఎవరు? సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్థారించే వాళ్లు వారి జేబుల నుంచి పది రూపాయలైనా తీసి ఇచ్చారా? కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, పది లక్షలు రూపాయలు విరాళాలుగా ఇవ్వాలంటే అలాంటివారికి మనసు ఒప్పుతుందా? అలాంటిది నా వరకు నేను తీసుకుంటే కొన్ని కోట్లు విరాళాలు ఇచ్చాను.
 
అలా చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలి. చిత్ర పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు వుండదు. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీకి గురయి నెట్లో రిలీజ్ అయితే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. గ్యారెంటీ సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇన్ని కష్టనష్టాలు వుంటాయి. సినిమా రంగంలోనివారికి పేరేమో ఆకాశానికి వుంటుంది కానీ డబ్బు ఆ స్థాయిలో వుండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాల టర్నోవర్ వుండదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు చేస్తారు. ఆ స్థాయి డబ్బులు ఇక్కడ వుండవు.
 
నిజానికి సంపద అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర, ఎలక్షన్ సమయంలో వందల కోట్లు ఖర్చు చేసిన రాజకీయ నాయకుల దగ్గర, వేల కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర, వేలకోట్లు విలువైన ఎగుమతుల వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తల దగ్గర, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వుండే సంస్థలు, కాంట్రాక్టర్ల దగ్గర వుంది. వాళ్లతో పోల్చితే సినిమా పరిశ్రమ చాలా చిన్నది. ఒక్క సీజన్లో అన్ని సినిమాలు ఖరీదు కలిపితే వెయ్యి కోట్లు కూడా వుండవు. అది కూడా ఒక్కడి ఆస్తి కాదు. ఒక సినిమా నిర్మించాలంటే పదిమంది ప్రతిభావంతులు కలిసి పనిచేయాలి. అన్నీ సరిగ్గా కుదిరితే డబ్బులు మిగులుతాయి. ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలో కోటి రూపాయలు సంపాదిస్తే అందులో జీఎస్టీ పోతుంది. అలాగే మిగిలిన ట్యాక్సులు అన్నీ పోగా 55 లక్షల నుంచి 60 లక్షల వరకూ చేతికి అందుతుంది. అదే నష్టం వస్తే ఆ డబ్బు కూడా మిగలదు. ఎంతోమంది జీవితాలు కోల్పోయిన వారు ఈ రంగంలో వున్నారు. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన పరిశ్రమ. సులువుగా టార్గెట్ చేసేస్తారు.
 
ఎన్నికల సమయంలో వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, ఓడినా భారీగా ఖర్చుపెడుతున్న వాళ్లు అధికారం వున్నా లేకున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు బయటకు తీయాలి. వారివారి నియోజకవర్గాల్లో ఎలక్షన్ల పెట్టుబడి అనుకుని రూ. 50 కోట్లయినా ఖర్చు పెట్టి బాధితులకు అండగా వుంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. కరోనా విపత్కర పరిస్థితుల్లో నేను కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇస్తే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గారు 25 కోట్లు ఇచ్చారు. సంతోషం. నా స్థాయి కోటి రూపాయలు, రెండు కోట్లయితే అక్షయ్ కుమార్ గారి స్థాయి రూ. 25 కోట్లు. అందులో మెహర్బానీ ఏమీ లేదు. కొంతమంది విరాళాలు ఇవ్వరు. విరాళం అనేది స్పందించి ఇవ్వాలి తప్ప... మీరు ఎందుకు ఇవ్వలేదని అడగడానికి లేదు. 
 
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. బయట డబ్బు పుట్టడం కష్టంగా మారింది. పని చేద్దామంటే పని దొరికే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా విరాళాలు అంటే అందరికీ ఇబ్బందికర పరిస్థితే. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు విరాళాలు ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రో యాక్టివ్. ఆయన అన్ని వర్గాల వారికి విజ్ఞప్తి చేసారు.
 
మంత్రివర్గంలోని సభ్యులు వారివారి స్థాయిలో అన్ని వర్గాలవారికి చేరవవుతున్నారు. సంపద సృష్టించినప్పుడు కొంత సంపద ఇవ్వొచ్చు. కానీ సంపదే లేనప్పుడు విరాళాలు అడిగితే కొద్దిగా ఇబ్బందే. అయినా కేసీఆర్ లాంటి ప్రో యాక్టివ్ ముఖ్యమంత్రి అడిగారని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల వారిని రీచౌట్ అవ్వాలి. రాజకీయాల్లోకి సేవ చేయాలనే భావనతో అందరూ వచ్చారు. ఎలక్షన్ సమయంలో గెలిచినా, ఓడినా వందల కోట్లు ఖర్చు చేసారు. ఈ విపత్కర సమయంలో రాజకీయ నాయకులు వారివారి నియోజకవర్గాల్లో ఎలక్షన్‌కి పెట్టుబడి అనుకుని పెద్ద మనసుతో వరద బాధితులకు అండగా వుండాలని కోరుతున్నాను.'' అని చెప్పారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్‌.. హిందీతో పాటు తెలుగు, మలయాళంలోనూ..?