Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌

కర్నూలు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌
, గురువారం, 25 మార్చి 2021 (18:08 IST)
కర్నూలు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.... ‘కర్నూలు జిల్లా చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు. ఇది ఎప్పటికీ నిల్చిపోతుంది. కారణం ఏమిటంటే ఇప్పటి వరకు కర్నూలు నుంచి ప్రయాణం అంటే రోడ్డు లేదా రైలు మార్గమే అందుబాటులో ఉండగా, ఇక నుంచి విమానయానం కూడా వచ్చింది. అందుకే ఈరోజును కర్నూలు జిల్లా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఈనెల 28 నుంచి ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు సర్వీసులు నడుస్తాయి. ఒకేసారి 4 విమానాలు ఇక్కడ పార్కు చేసుకునే వీలుంది’.
 
6వ విమానాశ్రయం
‘ఇప్పటి వరకు రాష్ట్రంలో5 విమానాశ్రయాలు ఉండగా, ఇది 6వ విమానాశ్రయం కాబోతున్నది. ఇప్పటికే తిరుపతి, కడప, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో కర్నూలు విమానాశ్రయం కూడా చేరింది’.
 
ప్రతిష్టాత్మక విమానాశ్రయం:
‘ఈ ఓర్వకల్లు విమానాశ్రయం.. రాష్ట్రంలో మనందరం నిర్మించుకోబోతున్న న్యాయ రాజధానిని, మిగతా రాష్ట్రాలతో సమానంగా, గర్వంగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను’.
 
పనులు పూర్తి కాకున్నా!:
‘ఈ విమానాశ్రయానికి సంబంధించి గతంలో మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు కేవలం నెల రోజుల గడువు ముందు, విమానాశ్రయం నిర్మాణం ఏ మాత్రం పూర్తి కాకున్నా, కనీసం అనుమతులు లేకపోయినా, విమానాలు ఎగరలేని పరిస్థితుల్లో, కనీసం రన్‌వే కూడా పూర్తి కాకముందే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వచ్చి, ఇక్కడ రిబ్బన్‌ కట్టింగ్‌ కూడా చేశారు. దాన్ని మనమంతా కళ్లారా చూశాం’.
 
ఏడాదిన్నర వ్యవధిలోనే..:
‘అప్పటి నుంచి దాదాపు రెండేళ్లు గడిచాయి. ఇదే కర్నూలులో ఇక్కడ కచ్చితంగా విమానాశ్రయం రావాలని, పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి, కేవలం ఏడాదిన్నరలోనే ప్యాసింజర్‌ టర్మినల్‌ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, అడ్మిన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్, సబ్‌ స్టేషను, రన్‌వేలోని బ్యాలెన్సు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం’. ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాం. ప్యాసింజర్‌ టర్మినల్‌ వద్ద కార్‌ రెంటల్, బేబీ కేర్, మెడికల్‌ కేర్‌ వంటి అన్ని సదుపాయాలు కల్పించాం’.
 
వారందరికీ అభినందనలు:
‘కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ), పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) అనుమతులు రప్పించడంలో మన మంత్రి, మన అధికారులు ఎంతో పని చేశారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను’.
 
ఉయ్యాలవాడ పేరు:
‘దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. బారత జాతీయ కాంగ్రెస్‌ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీగారు మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో తొలిసారిగా బిహార్‌లోని చంపారన్‌లో తొలి సత్యాగ్రహం జరిగింది. అయితే వీటన్నింటి కంటే ముందు ఈ కర్నూలు గడ్డ మీద, స్వాతంత్య్రానికి 100 ఏళ్ల ముందే మొదటి స్వాతంత్య్ర పోరాటం జరిగింది’.
 
‘1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్ర పోయిన ఒక మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళిగా ఇవాళ ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు పెడుతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను’.
 
మరింతగా పని చేస్తాను:
‘దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు, ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం ఇచ్చారు. మీరంతా మాకు మద్దతుగా నిల్చారు. మద్దతు పలికారు. మీ అందరి కోసం ఇంకా మరింతగా పని చేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితుడికి నిండు మనసుతో తెలియజేస్తూ, మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.
 
ఆ తర్వాత కర్నూలు విమానాశ్రయం చిత్రంతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను సీఎం ఆవిష్కరించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి,  గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్‌ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జ‌గ‌న్‌ సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయి: నారా లోకేష్