Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో కొత్త సర్కారులో మహిళా శక్తి: కీలక పదవుల్లో 14మంది మహిళలు

అమెరికాలో కొత్త సర్కారులో మహిళా శక్తి: కీలక పదవుల్లో 14మంది మహిళలు
, బుధవారం, 20 జనవరి 2021 (12:33 IST)
అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ప్రధానంగా మహిళా శక్తి నడిపించబోతోంది. ప్రపంచంలో దాదాపు మరే ప్రభుత్వంలోనూ లేనంత మంది మహిళలు... వారిలో పద్నాలుగు మంది భారతీయ మూలాలున్న మహిళలు కీలకమైన పదవుల్లో సత్తా చాటబోతున్నారు. ఇప్పటికే తమ తమ రంగాల్లో ప్రతిభను చాటుకున్న ఈ మహిళలు అమెరికా పాలనపై తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.
 
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ పదవి అందుకుంటున్న తొలి శ్వేతేతర, ఏసియన్‌-అమెరికన్‌గా కూడా ఆమె రికార్డు స్థాపించారు. అంతేకాదు, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మొదటి దక్షిణాసియా-అమెరికన్‌, తొలి ఆఫ్రికన్‌-అమెరికన్‌గానూ గుర్తింపు సాధించారు. కమల తల్లి శ్యామలది తమిళనాడు కాగా తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ జమైకాకు చెందినవారు.
 
ఆక్లాండ్‌లో జన్మించిన కమల హారిస్‌ హోవర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ, తరువాత ‘హేస్టింగ్స్‌ కాలేజీ ఆఫ్‌ లా’ నుంచి న్యాయ విద్యలో పట్టా అందుకున్నారు. పౌర హక్కుల ఉద్యమకారిణిగా పేరు పొందారు. 2017లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా తన వాణిని ఆమె బలంగా వినిపించారు. కిందటి ఏడాది జరిగిన ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త డగ్లస్‌ కూడా న్యాయవాదే. తన భారతీయ మూలాలను అమితంగా ఇష్టపడే కమల ఉపాధ్యక్షురాలుగానూ తన ప్రత్యేకతను చాటబోతున్నారు. 
 
అలాగే అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్‌ చీఫ్‌ నీరా టాండన్‌ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌, అమెరికన్‌ ప్రోగ్రెస్‌ యాక్షన్‌ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
 
మాలా అడిగా.. ఈమె ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. జిల్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌-కమలా హారిస్‌ బృందంలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్‌ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మాలా కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు. 
 
ఇంకా నేహా గుప్త వైట్‌హౌస్‌ న్యాయవాద బృందంలో అసోసియేట్‌ కౌన్సెల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న భారతీయ సంతతి మహిళ. ఈమె న్యూయార్క్‌లో పుట్టారు. స్టాన్‌ఫోర్డ్‌ లా స్కూల్‌, హార్వర్డ్‌ కాలేజీల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాలు పొందిన ఆమె శాన్‌ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ కార్యాలయంలో డిప్యూటీ సిటీ అటార్నీగా పని చేశారు.  
 
ఇంకా సమీరా ఫాజిలీ బైడెన్‌ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. సమీర తల్లితండ్రులది కశ్మీర్‌. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అయితే కశ్మీర్‌తోనూ, అక్కడి బంధువులతోనూ సంబంధాలు తెంచుకోలేదు. సమీర కూడా మెడిసిన్‌ చదవాలని తల్లితండ్రులు పట్టుపట్టినా... వాళ్ళని ఒప్పించి మరీ ఎకనామిక్స్‌ను ఎంచుకున్నారు.  
 
ప్రస్తుతం బైడెన్‌-హారిస్‌ టీంలో ఎకనామిక్‌ ఏజెన్సీ చీఫ్‌గా ఉన్నారు.. కాగా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019లో... కశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు, అమెరికాలో జరిగిన ఆందోళనల్లో సమీర పాలుపంచుకున్నారు. 
 
బైడెన్‌ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్‌ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్‌ సోనియా అగర్వాల్‌ కుటుంబానిది పంజాబ్‌ ప్రాంతం. అమెరికాలోని ఓహియో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. 
 
సుమోనా గుహా
వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. బైడెన్‌ - హారిస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు.
 
ఉజ్రా జేయా
పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల శాఖకు నామినేట్‌ అయిన కశ్మీరీ మహిళ ఉజ్రా జేయా. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఉజ్రా ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులు, బహుపాక్షిక అంశాలలో నిష్ణాతురాలు.
 
అయేషా షా 
శ్వేత సౌథంలోని డిజిటల్‌ వ్యూహ కార్యాలయంలో పార్టనర్‌షిప్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపడుతున్న అయేషా కశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లోని గగ్రిబల్‌లో పుట్టారు. ఆమె బాల్యమంతా అమెరికాలోని లూసియానాలో గడిచింది. ఆమె తండ్రి డాక్టర్‌ అమిర్‌ షా. శ్రీనగర్‌లోని ప్రముఖ కుటుంబాల్లో వారిది ఒకటి. 
 
వనితా గుప్తా
అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన మానవహక్కుల న్యాయవాది, భారతీయ వలస తల్లితండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్‌ కొనియాడిన భారతీయ మహిళ వనితా గుప్తా. సెనేట్‌కు నామినేట్‌ అయిన మొట్టమొదటి ఇండియన్‌ అమెరికన్‌ అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కూడా వనితానే! లీగల్‌ డిఫెన్స్‌ ఫండ్‌లో ఉద్యోగిగా కెరీర్‌ను మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఒబామా- బైడెన్‌ ప్రభుత్వంలో జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌లో మానవహక్కుల డివిజన్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్‌ ప్రజలను ఏకం చేసే సమానత్వం, స్వేచ్ఛ కోసం ఆమె ఎంతో కృషి చేశారు. 
 
శాంతి కలతిల్‌
శాంతి కలతిల్‌ది కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. యు.సి. బర్కిలీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదివారు. ‘ఆసియన్‌ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’కు హాంకాంగ్‌లో రిపోర్టర్‌గా పని చేశారు. ప్రస్తుత సమాచార యుగంలో... నిరంకుశ అధికారతత్త్వం కారణంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ళపై లోతైన అధ్యయనం చేశారు. అనేక  పుస్తకాలు రాశారు. 
 
రీమా షా
రీమా షా పూర్వీకులది గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం. ఆమె తల్లితండ్రులు ప్రీతి, భరత్‌ షా. వారి ఇద్దరు పిల్లల్లో రీమా చిన్నవారు. ఆమెపుట్టిందీ, పెరిగిందీ కాలిఫోర్నియాలో. హార్వర్డ్‌ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్‌ లా స్కూల్‌లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన రీమా కాలిఫోర్నియా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, అమెరికా సుప్రీం కోర్టు... ఇలా అనేక న్యాయ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు శ్వేత సౌధంలో డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సెల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. 
 
గరిమా వర్మ
భారత సంతతికి చెందిన గరిమా వర్మ అమెరికా ప్రఽథమ మహిళ జిల్‌ బైడెన్‌కు డిజిటల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతదేశంలో జన్మించిన గరిమా తల్లితండ్రుతలతో కలిసి అమెరికా వలస వెళ్లారు. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌- కమలా హారిస్‌తో కలసి పనిచేశారు. వారికి మీడియా స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు. రాజకీయాలకు పూర్వం గరిమా పారమౌంట్‌ పిక్చర్‌ చిత్రనిర్మాణ సంస్థకు గ్రాఫిక్స్‌ అధినేతగా పనిచేశారు. తర్వాత ఎబిసి నెట్‌వర్క్‌ టెలివిజన్‌ షోలో హోస్ట్‌గానూ ఆమె వ్యవహరించారు. తర్వాత హెరైజెన్‌ మీడియా అనే ఏజెన్సీని నడిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశువుల మేతకోసం వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..