Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా సరిహద్దులకు భారీగా బలగాలు తరలిస్తున్న భారత్

చైనా సరిహద్దులకు భారీగా బలగాలు తరలిస్తున్న భారత్
, గురువారం, 25 జూన్ 2020 (21:18 IST)
ఇండో చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనివుంది. వీటిని తగ్గించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ... పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భారత్ భారీ ఎత్తున చైనా సరిహద్దులకు బలగాలను తరలిస్తోంది. అలాగే, చైనా కూడా అదనపు బలగాలను మొహరిస్తోంది. 
 
ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో కీలక స్థానాలుగా భావించే గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగోంగ్ సరస్సు వద్ద ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని జాతీయ భద్రతా మండలి పేర్కొంటోంది.
 
ఈ నేపథ్యంలో, సమస్యాత్మక ప్రాంతాలకేకాకుండా, 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా సైనిక బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు కేంద్ర వర్గాలంటున్నాయి. 
 
సైన్యానికి మద్దతుగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కూడా తన బలగాలను, ఆయుధ సంపత్తిని తరలిస్తోంది. ఉద్రిక్తతలు నెలకొన్న అనేక గస్తీ పాయింట్ల వద్ద చైనా కొత్త నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 
 
ఇప్పటికీ చైనా దూకుడు తగ్గకపోవడం భారత్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. చైనా దుశ్చర్యలను ప్రపంచం మొత్తం ఛీకొడుతున్నా.. డ్రాగన్ కంట్రీకి మాత్రం చీమకుట్టినట్టుగా లేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, భారత్ చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని రెండు పెద్ద దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనివుండటం ఏమాత్రం భావ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వల్పంగా వర్తకం జరిపిన మార్కెట్లు; 16 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ