Publish Date: Sat, 25 Jun 2022 (09:17 IST)
Updated Date: Sat, 25 Jun 2022 (09:18 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోవిడ్ టీకా అనేక లక్షల మంది ప్రాణలను కాపాడింది. భారత్లో తయారైన కోవిడ్ టీకాలు కోట్లాది మందికి సంజీవనిలా పనిచేసింది. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 42 లక్షల మరణాలను వ్యాక్సిన్ నిలువరించిందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల ప్రాణాలు కాపాడినట్లు తేల్చింది. కరోనా మహమ్మారి నుంచి టీకా ఎంత అద్భుతంగా ప్రజలను కాపాడిందో తెలుపుతూ.. అధ్యయన వివరాలను ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ ప్రచురించింది. మహమ్మారి బారినపడి ప్రపంచమంతా విలవిలలాడుతున్న తరుణంలో వచ్చిన కొవిడ్ టీకా.. కరోనా మృత్యుకోరలు పీకేయడంలో కీలకంగా వ్యవహరించిందని, అధిక ప్రాణనష్టం సంభవించకుండా కాపాడిందని అధ్యయనం తేల్చింది.
విశ్వవ్యాప్తంగా దుర్భర, కఠిన పరిస్థితులను వ్యాక్సిన్లు నివారించాయని, వైరస్ను సమర్థంగా నిరోధించాయని పేర్కొంది. చైనా మినహా ప్రపంచంలోని 185 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. కొవిడ్ వ్యాప్తి, బాధితులు, మరణాలు సహా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం బహిర్గతం కాని కారణంగా ఈ అధ్యయనంలో చైనాను పరిగణనలోకి తీసుకోలేదని అధ్యయనకర్తలు వెల్లడించారు.