ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు : సీఎం కుమార స్వామి
తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదనీ, అదేసమయంలో డబ్బు సంపాదించాలనే ఆసక్తి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. అందువల్ల మహాత్మాగాంధీ చూపిన మార్గదర్శకత్వంలో పాలన సాగించి పేద కుటుంబా
Publish Date: Tue, 12 Jun 2018 (08:50 IST)
Updated Date: Tue, 12 Jun 2018 (08:51 IST)
తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదనీ, అదేసమయంలో డబ్బు సంపాదించాలనే ఆసక్తి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. అందువల్ల మహాత్మాగాంధీ చూపిన మార్గదర్శకత్వంలో పాలన సాగించి పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని చెప్పారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి సోమవారం కుమారకృప రోడ్డులోని గాంధీభవన్ను సందర్శించారు. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు తాను గనుక సిద్ధమైతే తనను ముఖ్యమంత్రి స్థానం నుంచే తప్పించే వ్యవస్థ ఏర్పడిందన్నారు.
సమాజంలో పాతుకుపోయిన అవినీతి నిర్మూలన పూర్తిస్థాయిలో సాధ్యం కాదన్నారు. ఎందుకంటే తనకు పూర్తి స్థాయి మెజారిటీ లేనందున కఠినమైన నిర్ణయాలు తీసుకోలేనన్నారు. రెండు మూడ్రోజుల్లో అధికారులతో సమావేశమై.. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.
అలాగే, ప్రభుత్వం నుంచి తమ మఠానికి ఏమీ చేయకపోయినా ఫర్వాలేదని, సమాజంలో అవినీతిని నిర్మూలించాలని శృంగేరి మఠాధిపతి తనకు సూచించారనీ, ఆయన సూచనను తు.చ తప్పకుండా ఆచరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.