Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇష్టంలేని హెయిర్ స్టైల్ చేయించిందని.. అమ్మపై కోపంతో కుమారుడి ఆత్మహత్య

ఇష్టంలేని హెయిర్ స్టైల్ చేయించిందని.. అమ్మపై కోపంతో కుమారుడి ఆత్మహత్య
, మంగళవారం, 21 జనవరి 2020 (11:02 IST)
ఈ తరం యువత ఫ్యాషన్‌కు పెద్ద పీట వేస్తోంది. కొత్త కొత్త డ్రెస్‌ స్టైల్, హెయిర్ కట్స్, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ అంటూ చాలా వేగంగా దూసుకుపోతోంది. కానీ ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత ఆలోచనలను పెంపొందించుకునేందుకు మాత్రం మనదేశ యువత కాస్త వెనక్కి తగ్గి వుందని సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో గడిపే యువత అత్యధిక శాతం వున్నట్లు తాజా సర్వేలో వెల్లడి అయ్యింది. 
 
ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే.. హెయిర్ స్టైల్ తనకు నచ్చినట్లు తల్లి చేయించలేదని.. దగ్గరుండి మరీ హెయిర్ స్టైల్‌ను మార్పించిందని ఓ కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు ఇష్టంలేని కటింగ్ చేయించిందనే మనస్తాపంతో ప్లస్ టూ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శీనివాసన్ (17) కుండ్రత్తూరులోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ 12వ తరగతి చదువుతున్నాడు. 
 
ఇటీవల సంక్రాంతి సెలవుల కారణంగా ఇంటికి వచ్చాడు. అయితే కుమారుడి హెయిర్‌స్టైల్ చూసిన తల్లి మోహన ఆగ్రహం వ్యక్తం చేసింది. చదువుకునే వయస్సుల్లో ఏ ఫ్యాషన్ కటింగ్‌లు ఎందుకని అడిగింది. అంతటితో ఆగకుండా సెలూన్‌కు వెళ్లి చక్కగా కటింగ్ చేయించుకోమని చెప్పింది. అయితే, అతడు ఒక్కడే వెళ్తే మళ్లీ అలాగే చేయించుకుంటాడని భావించిన మోహన.. కుమారుడిని తీసుకుని సెలూన్‌కు వెళ్లింది. దగ్గరుండి కటింగ్ చేయించింది. 
 
ఆదివారం ఉదయం కుమారుడిని ఇంటి దగ్గరే వదిలేసి ఆమె తన పనులకు వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చి చూసిన తల్లి షాకైంది. ఇంట్లోని ఫ్యాన్‌కు శీనివాసన్ చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుమారుడిని విగతజీవిగా చూసిన మోహన రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత