Publish Date: Thu, 19 Jan 2023 (09:51 IST)
Updated Date: Thu, 19 Jan 2023 (09:53 IST)
దేశంలో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటి నగరాల్లో బెంగుళూరు ఒకటి. ప్రతి రోజూ ఈ నగర వాసులకు ట్రాఫిక్ పగటిపూటే చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఓ వధువుకు కూడా వింత అనుభవం ఎదురైంది. కళ్యాణ మండపానికి ఇంటి నుంచి కారులో బయలుదేరిన వధువుకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. దీంతో ఆమె మధ్యలోనే కారు దిగి మెట్రో రైలు ఎక్కారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో ముహూర్త సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేనని భావించిన ఆ వధువు.. పెళ్ళి కుమార్తె ముస్తాబులోనే మెట్రో రైలు ఎక్కిసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ఇతర ప్రయాణికులు నోరెళ్లబెట్టారు.
అయితే, నెటిజన్లు మాత్రం వధువు సమయస్పూర్తిని కొనియాడుతున్నారు. స్మార్ట్ పెళ్ళికూతురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ముహూర్త సమయానికే బయలుదేరడం ఏంటి.. కాస్త ముందుగా బయలుదేరవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ముహూర్త సమయాని ఆ వధువు మండపానికి చేరుకుని పెళ్లిపీటలపై కూర్చొని మెడలో మూడు ముళ్లు వేయించుకుంది.