Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతి చరిత్ర, గొప్పతనం చెప్పే సాహో.. శాతకర్ణి.. "గౌతమిపుత్ర శాతకర్ణి" ఫుల్ రివ్యూ రిపోర్ట్

శాతకర్ణి తన తల్లిపేరుతో గౌతమిపుత్ర శాతకర్ణి అయినట్లే.. ఈ చిత్రానికి పనిచేసిన వారి మాతృమూర్తుల పేర్లు ముందుగా రాసి దర్శకుడు క్రిష్‌ కొత్త ఒరవడికి దిగాడు. అసలు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి స్కూల్‌ పుస్

జాతి చరిత్ర, గొప్పతనం చెప్పే సాహో.. శాతకర్ణి..
, గురువారం, 12 జనవరి 2017 (13:28 IST)
నటీనటులు : బసవతారకమ్మ పుత్ర బాలకష్ణ, నీరజ పుత్రిక శ్రియ శరన్‌, జయలక్మి పుత్రిక హేమ మాలిని తదితరులు.
నిర్మాతలు : సీతారామ పుత్ర సాయి బాబా జాగర్లమూడి, కమల పుత్ర వై రాజీవ్‌ రెడ్డి, సంగీతం : భారతి పుత్ర చిరంతన్‌, దర్శకత్వం : అంజన పుత్ర క్రిష్‌
 
శాతకర్ణి తన తల్లిపేరుతో గౌతమిపుత్ర శాతకర్ణి అయినట్లే.. ఈ చిత్రానికి పనిచేసిన వారి మాతృమూర్తుల పేర్లు ముందుగా రాసి దర్శకుడు క్రిష్‌ కొత్త ఒరవడికి దిగాడు. అసలు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి స్కూల్‌ పుస్తకాల్లో తప్పించి పెద్దగా ఇప్పటితరానికి తెలీదు. అందులోనూ ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక, అమరావతి రాజధానిగా చేసుకుని పాలిస్తున్న ఇప్పటి తరుణంలో గత చరిత్ర గురించి సినిమా రావడం యాదృశ్చికమే అయినా తెలుసుకోదగింది. భైరవద్వీపంలో కృష్ణదేవయారలు పాత్ర చేసిన బాలకృష్ణ ఇందులో నటించడంతోపాటు 'కంచె' సినిమాను తెరకెక్కించిన క్రిష్‌ ఈ చిత్రాన్ని రూపొందించడంతో చిత్రంపై మరిన్ని అంచనాలున్నాయి. అదెలా వుందే చూద్దాం.
 
కథ :
శాతవాహన సామ్రాజ్యానికి చెందిన శాతకర్ణి క్రీ.పూ. ఒకటి, రెండు శతాబ్దాలనాటివాడు. చిన్నతనంలో తండ్రి యుద్ధాని వెళితే.. తల్లి గౌతమిని (హేమామాలిని) యుద్ధం ఎందుకు? ప్రజలు ఎందుకు యుద్ధం చేయాలని ప్రశ్నిస్తాడు. యుద్ధం అనేది రాజ్యకాంక్ష. రాజుల చేసేది. చిన్న చిన్న రాజ్యాలన్ని జయించడమేనని అంటుంది. అవన్నీ ఒక్కరాజ్యంకిందకి తెస్తే.. అంటూ.. అదీ తనే చేస్తానని చెబుతాడు. అలా ఐదో ఏటనే ఏర్పడిన బీజం పెరిగి పెద్దదై అమరావతి చుట్టుపక్కల ఉత్తరాదితోసహా 33 గణ రాజ్యాల్ని ఏక సామ్రాజ్యం చేయడానికి యుద్ధాలు చేస్తుంటాడు శాతకర్ణి (బాలకృష్ణ). దీనివల్ల ఎంతోమంది ప్రజల ప్రాణాలు పోవడంతో శాంతికాముకులైన బౌద్ధబిక్షువులు ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నట్లు గౌతమికి విన్నవిస్తారు. అల్లకల్లోమైన రాజ్యాల్ని శాంతిగా నెలకొల్పాలనే సంకల్పంతో శాతకర్ణి చేస్తున్నట్లు చెప్పి వారిని అక్కడే వుండేలా చేస్తుంది. ఈ యుద్ధ సంకల్పం భార్య వాశిష్ట (శ్రియ)కు ఇష్టముండదు. తన వారసుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది.
 
మరోవైపు ఓ విదేశీయు రాజు సామంతరాజుల వారసులైన పిల్లల్ని బంధించి వారిని తమవైపు తిప్పుకునేలా చేస్తారు. ఆ భాగంలోగా శాతకర్ణి వారసుడు పులోమామిని కూడా బంధించే ప్రయత్నం చేయనున్నాడని తెలుసుకుని తనే తన బిడ్డతో అతని దగ్గరకు శాతకర్ణి వెళతాడు. అక్కడ జరిగే యుద్ధంలో విదేశీ రాజు ఓడిపోతాడు. ఇలా ఒక్కో గణాలను జయించి ఆఖరికి అమరావతికి చేరుకుని 33 రాజ్యాల విజయానికి చిహ్నంగా 33 కత్తులతో ఒకే కత్తిని తయారుచేసి.. రాజసూయ యాగం చేస్తాడు. ఇంకోవైపు పక్కల్లో బల్లెంలా ఉన్న మరో విదేశీరాజు డెమిట్రోస్‌తో యుద్ధం చేస్తూ సంధి పేరుతో విషప్రయోగానికి గురవుతాడు శాతకర్ణి. మరి ఆ తర్వాత శాతకర్ణి కల నెరవేరిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
శాతకర్ణి పాత్రకు బాలకృష్ణ పూర్తి న్యాయం చేశాడు. పాత్రలోని ఆవేశం అతనిలో జీర్ణించుకుని చెలరేగిపోయాడు. నడత, పలికే డైలాగ్స్‌ వినసొంపుగా అనిపిస్తాయి. తల్లిగా హేమామాలిని ఇమిడిపోయింది. భార్యగా శ్రియ సరిపోయింది. మిగిలిన పాత్రల్లో సుభలేఖ సుధాకర్‌, తనికెళ్ళభరణి, వినోద్‌ వంటివారు పోషించారు. 
 
టెక్నికల్‌:
చారిత్రాక చిత్రానికి కీలకం సాంకేతికత. దర్శకడు తను ఎన్ను కథకు అనుగుణంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు రాజులు చేసినట్లే ప్రతి విషయంలోనూ ప్రత్యేకత శ్రద్ధ తీసుకున్నాడు. వస్త్రధారణ, కేశాలంకరణ, గుర్రాలు, సైన్యం, ఆయుధాలు వంటివాటిపై శ్రద్ధపెట్టాడు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌. యుద్ధ సన్నివేశాలను చేసేటప్పుడు యాగం చేసేటప్పుడు అద్భుతంగా చిత్రించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితనం మెచ్చుకోదగింది. ఈ చిత్రంలో ప్రతి సాంకేతిక సిబ్బంది కష్టపడి పనిచేశారనే చెప్పాలి. సంగీతపరంగా చిరంతన్‌ శ్రద్ధ తీసుకున్నట్లే సంభాషణలపరంగా సాయిమాధవ్‌ బుర్రా అచ్చమైన తెలుగు పదాలను వాడాడు.
 
విశ్లేషణ:
దర్శకుడు క్రిష్‌ ఎంచుకున్న కథే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ప్రేక్షకుడికి మొదటిభాగం ఎమోషనల్‌గా ఒక ఊపు ఊపినట్లుగా కనెక్ట్‌ అవుతుంది. పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలకృష్ణ తన పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించడంలో నూటికి నూరు పాళ్ళు విజయం సాధించి ఆకట్టుకున్నాడు. ఇక తల్లిపట్ల శాతకర్ణికి వున్న అవ్యాజమైన ప్రేమను రాజసూయయాగంలో విశ్లేసిస్తాడు. భర్తలేని ఆవిడకు అగ్రతాంబూలం ఇవ్వడంపై పలువురు ఆక్షేపించడంతో అప్పుడు సాయి మాధవ్‌ బుర్రా రాసిన డైలాగులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిని బాలయ్య పలికించిన తీరు సినిమా మొత్తానికి మేజర్‌ హైలెట్‌గా నిలిచింది. ఇక దర్శకుడు క్రిష్‌ శాతకర్ణి జీవితం నుండి తీసుకున్న ప్రధాన అంశాలు అతనికి, అతని తల్లికి మధ్య ఉన్న అనుబంధం, అతని భార్య దృక్పథం, అఖండ భారతాన్ని సాధించాలనే అంతరంగం, అనుసరించిన కఠిన మార్గాలు, కొడుకును పణంగా పెట్టి అతను పడిన కష్టాలు, ప్రదర్శించిన సాహసం వంటివి వీక్షకులకు థ్రిల్‌ కల్గిస్తాయి.
 
భారత దేశ చరిత్రలో అందులోనూ ఆంధ్రదేశంలో గౌతమి శకం వచ్చాక విదేశీయులు దాదాపు 1500 సంవత్సరాలు చూడ్డానికి కూడా భయపడేవారు. ఇది శాసనాల్లో రాసింది. ఈ కథనే దర్శకుడు చెప్పాడు. ఇప్పటితరానికి తెలీని తెలుగువాడి చరిత్రను తెలియజెప్పే ప్రయత్నం అభినందనీయం.
 
అయితే చారిత్రిక అంశాలతో తెరకెక్కిన సినిమా ద్వారా వినోదం పంచలేరు కాబట్టి ఉత్కంఠ కలిగించాలి. యుద్ధంలో ఎత్తులు పై ఎత్తులు.. వినూత్న వ్యూహాలు అనేది 'బాహుబలి'లో రాజమౌళి చూపించాడు. అది ఊహాజనితం కాబట్టి.. గ్రాఫిక్‌ మాయాజాలంతో చేయగలిగాడు. కానీ ఈ సినిమాలో వాస్తవంగా ఎలా జరిగిందో అలా చూపించే దర్శకుడు ప్రయత్నం అభినందించదగినా.. యుద్ధంలో ఊహిని ట్విస్ట్‌లుంటే ఈ చిత్రం మరింతగా ఆకట్టుకునేది. రాజ్యకాంక్షతో యుద్ధాలు చేస్తూ సైన్యాన్ని కర్కశంగా నరుక్కుంటూ పోవడంతో రక్తం ఏరులై పారిందనే పుస్తకాల్లో రాసింది చూడాల్సివచ్చింది. ఫస్టాఫ్‌లో ఉన్న స్పీడ్‌ సెకండాఫ్‌లో తగ్గిందనే చెప్పాలి. బిబో శ్రీనివాస్‌ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి. ఈ చిత్రం జాతి చరిత్ర, గొప్పతనం ఇదీ అని చెప్పే ప్రయత్నం సఫలం అయినట్లే.
 
రేటింగ్‌: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిష్... నీ కోసం నా ట్విట్టర్ ప్రొఫైల్ పేరు మార్చుకున్నా: రానా దగ్గుబాటి