Publish Date: Thu, 20 May 2021 (14:44 IST)
Updated Date: Thu, 20 May 2021 (14:56 IST)
దివంగత ఎన్.టి.ఆర్. వియ్యంకుడు సీనియర్ నిర్మాత, దర్శకుడు యు. విశ్వేశ్వరరావు ఈ రోజు ఉదయం చెన్నై లో కరొనాతో కన్ను మూశారు. నందమూరి మోహనకృష్ణ ఈయన అల్లుడే. 1990ల నుంచీ చిత్రనిర్మాణానికి ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న విశ్వేశ్వరరావు వయసు 90 ఏళ్ళ పైమాటే. విశ్వశాంతి పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి ఎన్టీఆర్ తో కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్, పృథ్వీరాజ్ కపూర్ కాంబినేషన్ లో `కంచు కాగడా` చిత్రాన్ని నిర్మించాలని అనుకొన్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
ఆ తర్వాత దర్శకుడిగా మారి తీర్పు, మార్పు, నగ్న సత్యం,కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలు రూపొందించారు. తీర్పు చిత్రంలో ఎన్టీఆర్ జడ్జిగా నటించారు. మార్పు సినిమాలో విశ్వేశ్వరరావు గురువు , దర్శకుడు పి. పుల్లయ్య నటించారు. నగ్నసత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకమ్ సినిమాలకి బెస్ట్ డైరెక్టర్అవార్డులు అందుకున్నారు. 17వ నేషనల్ అవార్డ్స్ కమిటీ జ్యురీ మెంబర్ గా పని చేసిన ఈయన మరణంతో సీనియర్ను పరిశ్రమ కోల్పయింది.