Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Advertiesment
Bobby, anil ravipudi, Balakrishna, Sivalenka Krishnaprasad, babumohan

దేవీ

, సోమవారం, 31 మార్చి 2025 (12:56 IST)
Bobby, anil ravipudi, Balakrishna, Sivalenka Krishnaprasad, babumohan
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.  ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన రీ-రిలీజ్ అవుతోంది. భారతదేశ సినిమా చరిత్రలోనే టైమ్ ట్రావెల్ అనే పాయింట్ మీద రూపొందిన మొట్టమొదటి సినిమా ‘ఆదిత్య 369’. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో  ఈ సినిమా రూపొందింది.

నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కృష్ణకుమార్ అనే యువకుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను, 34 సంవత్సరాల తర్వాత  4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తెలుగువారి పర్వదినం ఉగాది నాడు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
 
కార్యక్రమం ప్రారంభంలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని ఎ.వి.గా ప్రదర్శించారు. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో ఉగాది పర్వదినం గురించి చెప్పిన డైలాగ్‌ని ప్రదర్శించినప్పుడు అభిమానులు ‘జై బాలయ్య’ అని నినాదాలు చేశారు.
 
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెన్నై నుంచి డిజిటల్‌ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో బాలకృష్ణ పోషించిన శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర బాగా హైలైట్ అయింది. అప్ప‌టికే ఎన్టీ రామారావు గారు శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర వేశారు. అలాగే `మహామంత్రి తిమ్మ‌రుసు`కు నేను ప‌ని చేశాను. స్క్రిప్ట్ కూడా ఒక వెర్షెన్‌ రాశాను పింగళి నాగేంద్రరావు గారికి. ఆ రోజుల్లో నాచేత ఒకొక స్క్రిప్ట్ ఫ‌స్ట్ వెర్షెన్ రాయించేవారు. ఆ విధంగా తిమ్మ‌రుసు స్క్రిప్ట్ లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక ఆ పాత్ర ఎవ‌రు వేయాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు.. ఒకే ఒక వ్య‌క్తి మదిలో వ‌చ్చారు.

నాడు రామారావుగారు వేసిన శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర‌లో నేడు అంతే అద్భుతంగా రాణించాలంటే బాల‌కృష్ణకు మాత్ర‌మే సాధ్య‌మవుతుంద‌ని నేను నిర్ణ‌యించుకున్నాను. ఆ త‌ర్వాత ఆయ‌న్ను సంప్ర‌దించ‌డం, క‌థ చెప్ప‌డం.. బాల‌కృష్ణ గారికి స్టోరీ బాగా న‌చ్చి సినిమా చేద్దామ‌ని వెంట‌నే ఒప్పుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత బాలకృష్ణ మినహా అప్పుడు ఎవరూ లేరు..ఇప్పుడూ ఎవరూ లేరు. ఆయన ఎవర్‌గ్రీన్. అలాగే ఈ సబ్జెక్టుతో సినిమా నిర్మించాలంటే, పెద్దపెద్దవాళ్ళు సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో వుంది అన్నఫీలింగ్‌తో నిర్మించడానికి శివలెంక కృష్ణప్రసాద్ ముందుకువచ్చారు. ఈ సినిమా క్రెడిట్‌లో సింహభాగం శివలెంక కృష్ణప్రసాద్‌కి దక్కుతుంది. ఇన్నేళ్ళ తర్వాత ఈ సినిమా అత్యాధునికంగా విడుదల కావడం నాకు సంతోషం కలిగిస్తోంది’’ అన్నారు.
 
‘ఆదిత్య 369’ మూవీ రీ-రిలీజ్‌కి సంబంధించిన ట్రైలర్ని దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి విడుదల చేశారు.

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘సినిమా సినిమాకి వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయం అది. చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది, విశ్వానికే నటన ఎలా వుంటుందో చూపించింది నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. గ్లామర్ పాత్రలు చేసే సమయంలోనే ‘రాజు-పేద’ సినిమాలో డీ గ్లామర్ పాత్ర చేశారు. ఆయన స్ఫూర్తితో నేను భైరవద్వీపంలో చాలా డీగ్లామర్ పాత్రని చేశాను. ‘ఆదిత్య 369’ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ధరించడానికి నాన్నగారే ఇన్‌స్పిరేషన్. కొత్త కాన్సెప్ట్‌ తో సింగీతం గారు, కృష్ణప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు నా దగ్గరకి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. మంచి సినిమా అవుతుందన్న నమ్మకంతో ప్రోత్సహించాను. ఈ సినిమాలో నేను ధరించిన రెండు పాత్రల్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఆయా పాత్రల ఆత్మలోకి ప్రవేశించినప్పుడే అది కనిపిస్తుంది.
 
సింగీతం శ్రీనివాసరావు అంతకుముందు చేసిన సినిమాలు నేను చూశాను. ఆయన దర్శకత్వంలో, ఒక కొత్త కాన్సెప్ట్.తో సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాని నేను రీ-రిలీజ్ అని భావించడం లేదు. కొత్త సినిమా అన్నట్టుగానే అనుకుంటున్నాను. అందుకే ఇది ప్రీరిలీజ్ ఫంక్షనే తప్ప, రీరిలీజ్ ఫంక్షన్ అని నేను అనుకోవడం లేదు. ఇప్పటి యూత్‌కి కూడా బాగా నచ్చే సినిమా అవుతుంది. ఈ ఏప్రిల్ 4న అద్భుతం జరగబోతోంది. ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ ఈ సినిమాకి లభించబోతోంది. ప్రేక్షకులు పిల్లాపాపలతో వచ్చిన ఈ సినిమా చూస్తారు. ఈ సినిమాని అన్ని జనరేషన్లు చూస్తూనే వుంటారు. ఈ సినిమా గురించి, ఈ సినిమా శక్తి గురించి ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా గురించి భారతీయ సినిమా రంగం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ సినిమాది ఒకే ఒక ప్రింట్ దొరికింది. ప్రసాద్ లాబ్స్ వాళ్ళు ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు. శ్రీకృష్ణ పాండవీయం, దానవీరశూరకర్ణ కోవకు చెందిన సినిమా ‘ఆదిత్య 369’. ఈ జనరేషన్ ప్రేక్షకులు, రాబోయే జనరేషన్ పిల్లలు కూడా ఈ సినిమాని చూస్తారు. శివలెంక కృష్ణప్రసాద్ గారు ఈ సినిమాని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీశారు. నాతో ఇలాంటి సినిమా చేసిన శివలెంక కృష్ణప్రసాద్, సింగీతం గార్లకు కృతజ్ఞుణ్ణి. ఈ సినిమా వెనుక వున్న మూలస్తంభం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి నేను జీవితాంతం రుణపడి వుంటాను. ఇళయరాజా సంగీతం, పీసీ శ్రీరాం, వీఎస్ఆర్ స్వామి, కబీర్‌లాల్ కెమెరామన్ పనితనం, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలో  మొదలవబోతోంది. అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు’’ అన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా విడులైనప్పుడు నేను నాలుగో, ఐదో చదువుతున్నాను. గుంటూరులో చూశాను. ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్న  కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ తరం వారికి ఈ సినిమాని చూపించాలన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. నేను బాలకృష్ణ గారితో రూపొందించిన ‘డాకూ మహరాజ్‌’ సినిమా కేరెక్టర్‌కి ఇన్‌స్పిరేషన్ ‘ఆదిత్య 369’. రీ రిలీజ్‌లో కూడా ఈసినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది’’ అన్నారు.
 
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాని అద్దంకి శ్రీరామా థియేటర్‌లో చూశాను. అప్పుడు నాకు 9 సంవత్సరాలు. ఈ సినిమా వాల్ పోస్టర్ చూసి, బాగా ఆకర్షితుడణ్ణి అయ్యాను. సినిమా చూస్తుంటే ఇక మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. ఆ క్లాసిక్‌ మూవీని ప్రింట్ నుంచి డిజిటల్‌కి తీసుకురావడం అద్భుతం. ఇలాంటి సినిమాలను సేవ్ చేయడం అవసరం. బాలకృష్ణగారు చెప్పినట్టు ఇది రీ-రిలీజ్ కాదు.. ప్రీ రిలీజ్.. అఖండ-2 ముందు ఇది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆరోజుల్లో ఈ సినిమా చూసే అదృష్టం మా జనరేషన్‌కి కలిగింది. ఈ జనరేషన్‌కి కూడా ఆ అదృష్టాన్ని పేరెంట్స్ కలిగించాలి. పెద్దలు పిల్లకు ఈ సినిమా చూపించాలి. ఈ సినిమాలో ఎన్నో గొప్ప విషయాలు వున్నాయి. ఈ వీకెంట్ పిల్లందర్నీ థియేటర్లకి తీసుకెళ్ళి పిల్ల్నకి చూిపంచండి. బాలకృష్ణగారిని, సినిమాని చూసి ఈ జనరేషన్ కూడా మెస్మరైజ్ అవుతారు. ఆ రోజుల్లో ఈ సినిమా చూడటమే ఒక అదృష్టమైతే, ఇప్పుడు ఈ సినిమా కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరో అదృష్టం’’ అన్నారు.
 
నటుడు బాబూమోహన్ మాట్లాడుతూ, ‘‘బాలకృష్ణతో వుంటే షూటింగ్ చేసినట్టు వుండదు.. ఆడుకోవడానికి వెళ్ళినట్టు వుండేది. బాలకృష్ణ రెండు పాత్రలు వర్ణనాతీతం. నా దేవుడు ఎన్టీ రామారావు గారి అంశం. ఫైట్స్ షూటింగ్ అప్పుడు చూస్తే అద్భుతం. రెండు పాత్రలో కనులు మిరుమిట్లు గొలిపాయి. ఈ సినిమా తీసిన కృష్ణప్రసాద్ ధైర్యానికి మెచ్చుకోవాలి. దర్శకుడు సింగీతం సృష్ణించిన సృష్టి ఈ సినిమా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సినది మిగిలే వుంటుంది. తరతరాలుగా ఈ సినిమాని కొత్త సినిమాలాగా చూస్తారు’’ అన్నారు.
 
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘‘అప్పటికి నేను చిన్నోడు-పెద్దోడు సినిమా మాత్రమే చేశారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మంచి సినిమా చేద్దువుగాని అని అంటూ వుండేవారు. కొద్దిరోజుల తర్వాతే ఆయన సింగీతం గారిని కలవమని చెప్పారు. సింగీతం గారు అద్భుతమైన కథ చెప్పారని అన్నారు. సింగీతం గారిని కలిశాను. ఆయన అరగంట సేపు కథను చెప్పారు. కొన్ని సినిమాలు చూడమన్నారు. చూశాను. నాకు థ్రిల్లింగా అనిపిస్తోంది. కానీ, కొంచెం అర్థమయ్యీ కాకుండా వుంది అన్నాను. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ సినిమా తీయి. నిర్మాతగా కొన్ని దశాబ్దాలు మిగిలిపోతావు అన్నారు. నన్నునమ్ము అన్నారు. ఇది కేవలం నందమూరి బాలకృష్ణ చేస్తేనే ఈ సినిమా తీస్తాను అని సింగీతం గారు అన్నారు. దేవీవరప్రసాద్ గారి సహకారంతో బాలకృష్ణ గారిని కలిశాం. అప్పుడు బాలకృష్ణ గారు పూర్తి కమర్షియల్ సినిమాలు చేసే సమయం. బాలకృష్ణ గారిని కలిసి కథను చెప్పగానే, వెంటనే చాలా బాగుంది. నేను చేస్తున్నాను. అన్నారు. ఆ 30 సంవత్సరాల వయసులో బాలకృష్ణ గారు ఇలాంటి క్లాస్ కథను ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా నిర్మించడం నా పూర్వజన్మ సుకృతం. ఆ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అంతా పండగే. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చ జరుగుతూ వుండేది. చాలామంది ప్రముఖులు సెట్స్.కి అందరూ వచ్చి షూటింగ్ చూసేవారు. నేను ఎన్ని సినిమాలు తీసినా ‘ఆదిత్య369’ సినిమా ఇచ్చిన గౌరవం ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది. ఈ సినిమాని నిర్మించడం నా అదృష్ణం. ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యం గారు, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి వుంటాను. బాలకృష్ణ గారు ఈ సినిమా కోసం బాగా కష్టించి పనిచేశారు. తపనతో పనిచేశారు. ఇన్నేళ్ళ తర్వాత ‘ఆదిత్య 369’ని మళ్ళీ విడుదల చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి