ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్లో కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వానర సేన నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అలాగే, మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న "వారణాసి" చిత్రం టైటిల్పై కూడా వివాదం చెలరేగింది. ఈ టైటిల్ తమదేనంటూ ఓ వ్యక్తి తెలుగు ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేశారు.
ఇదే అంశంపై రాష్ట్ర వానరసేన నేతలు మాట్లాడుతూ, శివుడికి వాహనం అయిన ఎద్దు (నంది)పై హీరో మహేష్ బాబును ఎలా కూర్చోబెడతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పైగా, హిందూ దేవుళ్లపై నమ్మకం లేదంటూనే హిందూ దేవుళ్లపై సినిమాలు ఎలా తీస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రాక్షసులకి సపోర్టుగా దేవేంద్రుడి మీద బాహుబలి యుద్ధం చేస్తున్నట్టుగా చూపించి దేవతలను ఎందుకు డీగ్రేడ్ చేస్తారంటూ వారు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు.