Publish Date: Wed, 09 Oct 2019 (14:41 IST)
Updated Date: Wed, 09 Oct 2019 (14:48 IST)
లోక నాయకుడు కమలహాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి... తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతిహాసన్ తాజాగా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోకు హాజరై, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సలేతో డేటింగ్ చేస్తూ ఎన్నో మార్లు కనిపించి, ఫోటోలు ఎన్నింటినో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది కూడా. తమ పెళ్లి త్వరలో జరుగుతుందని ప్రకటించిన శ్రుతి, ఆపై అతనితో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోకు హాజరైన శ్రుతి, మైఖేల్తో బ్రేకప్ గురించి మాట్లాడుతూ, అతనితో సంబంధం తనకు మంచి అనుభవాన్ని మిగిల్చిందని చెప్పింది. ప్రస్తుతం తాను ఓ సరైన వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నానని వెల్లడించింది. తాను అమాయకంగా ఉంటానని, తన చుట్టూ ఉన్నవారు తనపై ఆధిపత్యం చలాయిస్తుంటారని వాపోయింది.
తనలో ఉన్న భావోద్వేగాలు, లక్షణాలు మైఖేల్లో కనిపించలేదని చెప్పింది. ఒకవేళ అటువంటి లక్షణాలున్న వ్యక్తి ఎదురైతే, తాను అతని ప్రేమలో పడితే, ప్రపంచానికి చెబుతానని చెప్పుకొచ్చింది. ఓ సమయంలో మంచిగా ఉన్న వ్యక్తి, మరో సమయంలో మరో విధంగా కనిపిస్తున్నాడని, ఇటువంటి సంఘటనల ద్వారా తనకు జీవితం గురించి నేర్చుకునే అవకాశం కలిగిందని పేర్కొంది.