Publish Date: Tue, 09 Apr 2019 (18:04 IST)
Updated Date: Tue, 09 Apr 2019 (18:07 IST)
హాస్య నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సంపూర్ణేశ్ బాబు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించాడు. ఈ మేరకు మొదటి నుండి కూడా తనకు నాటకాలు.. డ్రామాలు అంటే ఇష్టమనీ... అలాగే కొంతమంది ఆర్టిస్టుల వాయిస్తో మిమిక్రీ చేసేవాడిననీ చెప్పుకొచ్చిన సంపూ బాబు... ఇలా నటనపై తనకు ఉన్న ఆసక్తితోనే ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
కాగా, 'హృదయ కాలేయం' విడుదలైన తర్వాత, దర్శకుడు పూరి జగన్నాథ్ తనను పిలిపించి మరీ, 'లోఫర్'లో ఒక వేషం వేయమని చెప్పగా... ఆ సమయంలో తాను హీరోగా చేసిన 'కొబ్బరిమట్ట' విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో.. 'ఇప్పుడు చేయలేను సార్' అని చెప్పేసి పొరపాటు చేసాననీ... అలా పూరి సినిమాలో ఛాన్స్ను వదులుకోవడమే తాను చేసిన తప్పు అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటానని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. కాగా, ఆ తర్వాత పూరిగారిని కలిసి వేషం ఇవ్వమని అడిగినట్లు చెప్పుకొచ్చిన సంపూ బాబు... ఇంతవరకూ ఇవ్వలేదు. త్వరలో ఇస్తారేమో చూడాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు.