Publish Date: Mon, 03 Jan 2022 (20:49 IST)
Updated Date: Mon, 03 Jan 2022 (20:53 IST)
సినిమా టిక్కెట్ల ధరలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడం ప్రస్తుత హాట్ టాపిక్గా మారింది. టికెట్ రేటుకు హీరో పారితోషికాన్ని ముడిపెడుతూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు రామ్ గోపాల్ వర్మ.
హీరోల రెమ్యునరేషన్ల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ సరైనవి కావని, అసలు అందులో అర్థమే లేదంటూ విరుచుకుపడ్డారు ఆర్జీవీ. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంపై సెటైర్స్ వేశారు.
సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వెనుక ఓ ఇద్దరు హీరోలను తొక్కేయడమే అసలు కారణమని వస్తున్న ఆరోపణల గురించి తనకైతే పెద్దగా తెలియదని ఆర్జీవీ తెలిపారు. టికెట్ రేట్లు తగ్గిస్తే హీరోకి ఏమీ కాదని, మహా అయితే ఓ పది కోట్లు నష్టపోతారేమో.. కానీ సినిమాకు పనిచేసిన సిబ్బంది మాత్రం నష్టపోతారని ఆయన అన్నారు.
సినిమా కోసం కష్టపడి పనిచేసే టెక్నిషియన్స్, ఇతర సిబ్బందికి కోత పడుతుంది తప్ప పెద్దగా ఒరిగేదేమీ లేదని చెప్పారు. టికెట్ల రేట్ల అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదని చెప్పిన వర్మ, జగన్ గవర్నమెంట్ ఈ ఇష్యూని పరిష్కరించాల్సిన అవసరమైతే ఉందని చెప్పడం విశేషం.