టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాల వివాహం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో జరుగనుందనే వార్తలు వస్తున్నాయి. వీటిని పుష్ప బ్యూటీ రష్మిక కొట్టిపారేయడం లేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'నేను ఈ వార్తలను ఇప్పుడే ద్రువీకరించలేను. అలాగని వీటిని ఇప్పుడు ఖండించనూ లేను. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. ఖచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను. అంతకుమించిన వివరాలను ఇప్పుడే వెల్లడించలేను' అని అన్నారు.
'నేను వ్యక్తిగత జీవితం గురించి బయటకు వెల్లడించడానికి ఇష్టపడను. పర్సనల్ లై్ఫ్ను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ గురించి మాట్లాడను. బయటకు వచ్చినప్పుడు పర్సనల్ వర్క్ గురించి మాట్లాడను. ప్రతి పనికి ప్రణాళికలు వేసుకుంటాను. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు. కొన్ని కారణాల వల్ల ఉన్నట్టుండి షూటింగ్ వాయిదా పడుతుంది. మీటింగ్స్, రిహార్సల్స్ కారణంగా ఒక్కోసారి షూట్ ఆలస్యం అవుతుంది. నేను డబుల్ షిఫ్టు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నటీనటులు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండాలి. నరుటో కార్టూన్ అంటే నాకు ఎంతో ఇష్టం. దాని చూస్తూ విశ్రాంతి పొందుతాను' అని రష్మిక చెప్పారు.
ఇక అదే ఇంటర్వ్యూలో రష్మిక తన కెరీర్ గురించి, వరుస విజయాల గురించి మాట్లాడారు. 'ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకమైనది ఐదు సినిమాలు విడుదలై ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇండస్ట్రీలో ఈ స్థానానికి రావాలంటే ఎంతో కష్టపడాలి. విజయం ఒక్కసారిగా రాదు. నేను ఎలాంటి కథలలోనైనా నటించగలనని ప్రేక్షకులకు తెలియడానికి కొంత సమయం పట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. భాషాపరమైన, జానర్లకు సంబంధించిన ఎలాంటి హద్దులు లేకుండా అన్నిరకాల సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నా. ఈ ఏడాదిలో చేసిన ఐదు సినిమాల్లో అన్నీ భిన్నమైన పాత్రలే. అవి చూశాక ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది' అని అన్నారు.