మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే ఆ బాధ వారికి కూడా తెలుస్తుందని హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, మహిళల పీరియడ్స్ పెయిన్స్పై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
'మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే, ఆ బాధ ఏంటో తెలుస్తుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, తాజాగా ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి, తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై రష్మిక స్పందిస్తూ, 'ఇలాంటి సున్నితమైన విషయాల గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. అందుకే నాకు కార్యక్రమాలకు, ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయంగా ఉంటుంది. నేను ఒక ఉద్దేశంతో మాట్లాడితే, దాన్ని పూర్తిగా భిన్నంగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పాలనుకున్న దానికి, బయటకు వస్తున్న దానికి పొంతన ఉండటం లేదు' అని అన్నారు. తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించారు.
రుతుస్రావం సమయంలో తాను తీవ్రమైన నొప్పితో బాధపడతానని రష్మిక తెలిపారు. 'ప్రతి నెలా నేను ఈ భయంకరమైన నొప్పిని అనుభవిస్తాను. ఒకసారి నొప్పి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాను. వైద్యుల దగ్గరకు వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకున్నా, ఇది సాధారణమేనని వారు చెప్పారు. 'దేవుడా, నన్ను ఎందుకింతలా పరీక్షిస్తున్నావు' అని ప్రతి నెలా అనుకుంటాను. ఆ నొప్పిని అనుభవించిన వారికే దాని తీవ్రత తెలుస్తుంది. అందుకే ఆ బాధ పురుషులకు కూడా ఒక్కసారైనా తెలియాలని అలా అన్నాను' అని తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.