ఒరిస్సా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయాన్ని పేల్చివేసేందుకు గూఢచర్యం కేసులో అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రా రెక్కీ నిర్వహించారా? అనే సందేహం ఉత్పన్నమవుతోంది. ఈమె ఒరిస్సాకు వెళ్లి అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఆ సమయంలో ఆమెకు మరో మహిళా యూట్యూబర్ సహాయకారిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసిన విషయం సంచలనం రేపింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒరిస్సా పోలీసులు ఆరా తీస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతిపాతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితురాలి సామాజిక మాధ్యమాలను విశ్లేషించగా జ్యోతికి పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ విచారణ చేపట్టారు.
2024 సెప్టెంబరు 26వ తేదీ పూరీకి వచ్చిన జ్యోతి.. ఇక్కడి క్షేత్రాన్ని సందర్శించినట్టు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కన్ను ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ పరిస్థితుల్లో జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కీ నిర్వించి పాక్కు ఏదైనా సమాచారం అందించారా అన్న దానిపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి.