Publish Date: Mon, 15 Apr 2019 (16:01 IST)
Updated Date: Mon, 15 Apr 2019 (16:03 IST)
మనసులో ఉన్న మాటను దాచుకోకుండా, ఏ మాత్రం సంకోచించకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి పోసాని కృష్ణ మురళి. తనకు నచ్చని విషయాలను ముఖంపైనే అడిగేస్తారు. పోసాని తాజాగా 'మజిలీ' మరియు 'చిత్రలహరి' సినిమాల్లో కీలక పాత్రలో కనిపించాడు. రెండు సినిమాలు కూడా హిట్ అయ్యి పోసానికి మరింత గుర్తింపు తెచ్చాయి.
చిత్రలహరి సినిమాలో హీరో ఫాదర్గా పోసాని నటన అందరినీ నవ్వించడమే కాక కన్నీళ్లు కూడా పెట్టించింది. ఈ క్రమంలో పోసాని ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మెగా హీరోలందరిలోకి చిరు లక్షణాలు ఎక్కువగా సాయి ధరమ్ తేజ్లో కనిపిస్తున్నాయి అన్నారు. చిరంజీవి గారి లాగా తేజ్ కూడా వయస్సు, చదువు బట్టి వ్యక్తులను గౌరవిస్తారని చెప్పారు.
ఏ వయసు వారితో ఎలా నడుచుకోవాలో తేజ్కి బాగా తెలుసు. సెట్లో అతని ప్రవర్తన చిరంజీవి లాగానే ఉంటుందని చెప్పారు. కొండవీటి దొంగ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను. నా గురించి తెలుసుకున్న చిరంజీవి గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఎంఏ ఎంఫిల్ చేశారటగా అని ప్రశ్నించారు. డాక్టరేట్ కూడా రాబోతోందని విన్నాను అని నాతో అన్నారు.
ఆయన చదువుకున్న వారంటే అంత గౌరవం ఇచ్చేవారు. ఆయన ఒక్క మాటతో పిలిస్తే నేను పరిగెత్తుకు వెళ్లేవాడిని. కానీ చిరు నా దగ్గరకి వచ్చి మాట్లాడటం ఆయన గొప్పదనం అన్నారు. ఇప్పుడు అలాంటి లక్షణాలు సాయి ధరమ్ తేజ్లో కనిపిస్తున్నాయని చెప్పారు.