Publish Date: Wed, 12 Dec 2018 (13:05 IST)
Updated Date: Wed, 12 Dec 2018 (13:07 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "పేట". ఈ చిత్రం టీజర్ను సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే నాలుగు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. అలాగే చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న లతా రజనీకాంత్ నేతృత్వంలోని 'పీస్ ఫర్ ది చిల్డ్రన్' తరపున బుధవారం టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ యాప్ను విడుదల చేయబోతున్నారు.
మరోవైపు, బుధవారం రజనీకాంత్ 69వ యేటలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ పుట్టినరోజునాడు ఆయన చెన్నైలో లేకుండా ముంబైకు వెళ్లిపోయారు. దూరప్రాంత అభిమానులను కూడా చెన్నైకు రావొద్దంటూ ఓ ప్రకటన చేశారు.
ఆయన మంగళవారమే చెన్నై నుంచి ముంబై బయల్దేరి వెళ్లారు. వారాంతంలో చెన్నైకి తిరిగొస్తారని సమాచారం. పుట్టినరోజున చెన్నైలో ఉండడం లేదని, అభిమానులు ఎవ్వరూ ఇంటికి రావొద్దని రజనీకాంత్ కొన్ని రోజుల క్రితం జరిగిన పేట ఆడియో వేడుకలో ప్రకటించారు.
మరోవైపు, ఇకపోతే రజనీ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. రజనీ మక్కల్ మండ్రం, దక్షిణ చెన్నై జిల్లా రజనీకాంత్ అభిమానుల సంఘం తరపున మంగళవారమే సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. దివ్యాంగుల కోసం '2.0' స్పెషల్ షోను కూడా ప్రదర్శించారు.