ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని, మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మిథున్ చక్రవర్తి.. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉందని, 'డిస్కో డ్యాన్సర్' చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయని తెలిపారు. 'ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్...' అనే పాటను ఎవరూ మరచిపోలేరని పేర్కొన్నారు. హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి అని, తాను నటించిన గోపాల గోపాల సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 
 
									
										
								
																	
	 
	విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు పవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. (పవన్ కళ్యాణ్)