Publish Date: Fri, 02 Apr 2021 (16:24 IST)
Updated Date: Fri, 02 Apr 2021 (16:40 IST)
ప్రతిభావంతులైన యువ సృజనశీలురకు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి చెందిన చిత్ర నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. కలసి చిత్రాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాయని తెలియచేసేందుకు సంతోషిస్తున్నాం.
కోట్లాదిమంది అభిమానులను మెప్పించే పవన్ స్టార్ ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలిచే నేత శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ నవ్యరీతి చిత్రాలను, సృజనాత్మక కథలను ఇష్టపడతారు. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను... బహు భాషల్లో మన కథలను తీసుకువెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ను స్థాపించారు.
నిర్మాత శ్రీ టి.జి.విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. ద్వారా విస్తృతంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని పరిశ్రమ పంథాలో.. ప్రణాళికాబద్ధంగా సాగించాలనే ఆలోచనతో ఈ సంస్థ ద్వారా వేగంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి పదికిపైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
సినిమా నిర్మాణం అనేది సృజనాత్మక పరిశ్రమగా మరోమారు వెల్లడయ్యేలా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. సంస్థల భాగస్వామ్యం ఉండబోతుంది. పలురీతుల ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు... 6 మధ్యతరహా చిత్రాలు... 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం వల్ల - యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు, కలలు కార్యరూపం దాల్చే వేదిక రూపుదిద్దుకుంటుంది. కథా రచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది. శ్రీ హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతల్లో ఉంటారు. సంస్థ ప్రతినిధులు నిర్దేశిత సమయంలో మరింత సమాచారాన్ని తెలియచేస్తారు.