చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్ కు మంత్రులు, అధికారులు అండ ?
, బుధవారం, 13 ఆగస్టు 2025 (11:51 IST)
Kasturi Srinivas, Sankuri Ravinder, Bhadra, Shivshankar Patel, Hema Sudarshan and others
చిత్రపురిలో ఎల్.ఐ.జి, ఎం.ఐ.జి., రోహౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ లలో ఒకరిపేరున వున్న రిజిస్ట్రేషన్ మరో ఇద్దరు, ముగ్గురు పేరుమీద కూడా వున్నాయనీ, వీటికి కారకులు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ అని పలు ఆరోఫలు వున్నాయి. వాటిపై పోరాట సమితి వేసిన కోర్టు కేసుల్లోనూ జైలుకు వెళ్ళి వచ్చాడు. దాదాపు 300 కోట్ల స్కాం మొత్తంగా వుందని తేల్చారు. కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆగడాలు ఎక్కువయ్యాయి. దీనికి తెలంగాణలోని గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు కారణంకాగా, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తీరు కన్పిస్తోందని కార్మికులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు ₹300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ, వల్లభనేని అనిల్ కుమార్ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, వాటిని బయటి వ్యక్తులకు అమ్ముకోవడానికి కమిటీ ప్లాన్ చేసింది. ఇందుకు HMDA, CMO కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు," అని వారు ఆరోపించారు.
కోర్టు ఆదేశాలను బేఖాతరు
సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్పై ఇప్పటికే 15 FIRలు, 10 ఛార్జ్షీట్లు నమోదయ్యాయని, రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన అక్రమాలు ఆపడం లేదని నిరసనకారులు తెలిపారు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెం. 18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయిందని వారు మండిపడ్డారు.
ప్రభుత్వం, అధికారులపై తీవ్ర ఆరోపణలు
గత ప్రభుత్వం అవినీతిపరులను కాపాడి మూల్యం చెల్లించుకుందని, మరి ఈ ప్రభుత్వం ఎందుకు వారిని రక్షిస్తోందని వారు ప్రశ్నించారు. "కొందరు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఈ అవినీతిలో కూరుకుపోయారు. అందుకే ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకోవాలి. అధికారులు కోట్ల రూపాయల ఫ్రాడ్లో భాగస్వామిగా ఉంటూ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తప్పుదోవ పట్టిస్తున్నారు," అని ఆరోపించారు.
ప్రధాన డిమాండ్లు
* 20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు న్యాయం చేయాలి.
* కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి.
* వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కమిటీని రద్దు చేసి, వెంటనే అడ్-హాక్ కమిటీని నియమించాలి.
* కొత్తగా కట్టబోయే ట్విన్ టవర్స్లో కేవలం సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి, అర్హులైన సినీ కార్మికులకే కేటాయించాలి.
* కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఈ ధర్నా కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు సంకూరి రవీందర్, తెలంగాణ పోరాట మేధావి నాయకులు భద్ర, నవోదయం పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్, ఆప్ పార్టీ నాయకురాలు హేమ సుదర్శన్, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కృష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తర్వాతి కథనం