వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్నాటకలో పెను దుమారానికి దారితీసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్నాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్ తయారు చేసే ఈ సబ్బుకు ముంబై నటిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసి, రెండేళ్ల కాలానికిగాను రూ.6.2 కోట్లు చెల్లించేందుకు సమ్మతం తెలిపింది. ఇపుడు ఈ డీల్ రాజకీయ దుమారం రేపుతోంది.
తమ రాష్ట్రానికి చెందిన మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి తమన్నాను ఎలా నియమిస్తారంటూ కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సాంస్కృతికకు వారసత్వం అని.. అంతేకాకుండా ప్రాంతీయవాదానికి ఒక బ్రాండ్ అని పేర్కొంటున్నారు. అలాంటిది కన్నడ నటిని కాకుండా, బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటారని ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే తమన్నాతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అధికారికంగా లేఖ రాశారు. కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఒక బహిరంగ లేఖలో నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం అనైతికమైనది, బాధ్యతారహితమైనది, కన్నడిగుల మనోభావాల నుంచి డిస్కనెక్ట్ చేయబడిందని అభివర్ణించారు.