Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘కోటా- ద రిజర్వేషన్‌ ’ చిత్రంను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నిర్మాతలు

‘కోటా- ద రిజర్వేషన్‌ ’ చిత్రంను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నిర్మాతలు
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:57 IST)
కుల వివక్ష కారణంగా గత నాలుగేళ్లలో భారతదేశంలోని ప్రీమియర్‌ ఇనిస్టిట్యూట్‌లలో బలవన్మరణం పొందిన 18 మంది దళిత విద్యార్థులు ఎదుర్కొన్న అనుభవాలతో  ‘కోటా’ చిత్రం రూపొందిస్తున్నామనగానే వీక్షకులు, మీడియా, విమర్శకులు నుంచి అమితాసక్తి కలిగింది. ‘శూద్ర- ద రైజింగ్‌’ అంటూ గతంలో ఓ చిత్రం తీసిన దర్శకుడు సంజీవ్‌ జైశ్వాల్‌ ఇప్పుడు ‘కోటా-ద రిజర్వేషన్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా రోహిత్‌ వేముల, పాయల్‌తడ్వి, గురుప్రీత్‌ సింగ్‌ వంటి వారిని జ్ఞప్తికి తీసుకురానున్నారు.

 
ఈ చిత్రాన్ని రచయిత, నిర్మాత , దర్శకుడు సంజీవ్‌ జైశ్వాల్‌ తీర్చిదిద్దారు. ఆయన దీపక్‌ తిజోరి దర్శకత్వం వహించిన ఫరేబ్‌ ద్వారా పరిచయమైనప్పటికీ వివాదాస్పద చిత్రం‘ శూద్ర- రైజింగ్‌’ చిత్ర దర్శకునిగా ఖ్యాతి గడించారు. లక్షలాది మంది అంబేద్కర్‌ అభిమానులు ఈ చిత్ర విడుదల కోసం పోరాటం చేయడంతో పాటుగా శూద్ర చిత్రం ధియేటర్లలో విడుదలయ్యేందుకు తోడ్పడ్డారు.

 
రచయిత-దర్శకుడు సంజీవ్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ, ‘‘వెండితెరపై మా చిత్రం విడుదల చేయనుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. వినోదానికి ఓ ప్రయోజనం ఉండాలి. అదే సమయంలో బాబా సాహెబ్‌ ఆలోచనలు దేశవ్యాప్తంగా ప్రజలకు అర్ధమయ్యేలా తెలపాలి. థియేటర్లు దొరకడం మాకు కష్టమే అయినప్పటికీ ఆశాజనకంగానే ఉన్నాము.  ఈ చిత్ర కథ ఎంతోమందికి కనువిప్పు కలిగించనుంది’’ అని అన్నారు.

 
కుల వివక్ష బాధితుడు సౌరబ్‌ రావత్‌ పాత్రలో నటించిన  అనిరుధ్‌ దేవ్‌ మాట్లాడుతూ, ‘‘ఓ అర్ధవంతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పట్ల  ఆనందంగా ఉన్నాము.  ఓ నటునిగా ఈ కథలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ కథకు ప్రేక్షకులు కనెక్ట్‌ కాగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. దక్షిణాది నటుడు ఆదిత్య ఓమ్‌ ఈ చిత్రంలో యువ నాయకునిగా  కీలకమైన పాత్రలో నటించాడు . అతను కుల వివక్ష గురించి కోటా చిత్రంలో పోరాటం చేయనున్నారు.

 
కోటా-ద రిజర్వేషన్‌ ను 08 ఏప్రిల్‌ 2022 వ తేదీన హిందీ, మరాఠీ, పంజాబీ, తమిళం, తెలుగు, గుజరాతీ మరియు బెంగాలీ భాషలలో విడుదల చేయనున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూఖ్ పుత్రుడి కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి