Tribanadhari Barbarik - Vasishtha N. Simha
త్రిబాణధారి బార్బరిక్ కథ ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ వల్ల మోహన్ నాకు ఈ కథను వినిపించారు. ఏవమ్ షూటింగ్లో ఉన్నప్పుడు మోహన్, నరేంద్ర ఈ పాయింట్ను చెప్పారు. సోషియో, థ్రిల్లర్ అని చెప్పి ఈ టైటిల్ను చెప్పారు. త్రిబాణధారి బార్బరిక్ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర గురించి బయట చాలా మందికి తెలియదు. టైటిల్ చెప్పిన వెంటనే కథను వినాలని అనిపించింది. నెరేషన్ చేసిన దాని కంటే విజువల్గా అద్భుతంగా వచ్చింది అని కీలక పాత్రధారి వశిష్ట ఎన్ సింహా తెలిపారు.
వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సత్య రాజ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన తదితరులు నటించారు. ఈ మూవీని ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో నటుడు వశిష్ట ఎన్ సింహా మూవీ విశేషాల్ని పంచుకున్నారు.
ఈ కథలో కొత్తగా ఉండే అంశాలు ఏంటి?
త్రిబాణధారి బార్బరిక్ కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ ఇందులో నా కారెక్టర్ సరి కొత్తగా ఉంటుంది. ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నా పాత్ర ఉంటుంది. ఇందులోని స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది.
చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
మిడిల్ క్లాస్కు చెందిన ఓ అబ్బాయి పాత్రను పోషించాను. పెద్ద కలలతో ఉండే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అన్నది చాలా బాగా చూపించారు. బార్బరిక్ కథలో నా ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకు బార్బరికుడి థీమ్కు లింక్ ఉంటుంది. త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని చూస్తారు.
ఇతర పాత్రల గురించి చెప్పండి?
జవాబుదారితనం, బాధ్యతల గురించి ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ఇందులోని ప్రతీ పాత్రకు చాలా డెప్త్, ఇంపార్టెన్స్ ఉంటుంది. సత్య రాజ్ గారు, ఉదయ భాను గారు, క్రాంతి కిరణ్, నా పాత్ర, సాంచీ రాయ్ ఇలా అన్ని కారెక్టర్స్ చక్కగా కుదిరాయి. సత్య రాజ్ గారు ఇప్పటికే 170కి పైగా సినిమాలు చేశారు. శ్యామ్ కతు అనే పాత్రలో ఆయన చాలా అద్భుతంగా నటించారు. మనకి కూడా ఇలాంటి ఓ తాత ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఉదయ భాను గారు చాలా ఏళ్ల తరువాత ఓ శక్తివంతమైన పాత్రను పోషించారు. సత్యం రాజేష్ గారు, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, మేఘన ఇలా అందరి పాత్రలు ఆకట్టుకుంటాయి.
చిత్రంతో ఏం చెప్పబోతున్నారు?
మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఇదొక ట్రెండ్లా మారింది. ఇప్పుడు మేం బార్బరిక్ పాత్రతో వచ్చాం. ఇలాంటి మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇంకా వస్తే చాలా మంచిది. వీరందరి గురించి మన ముందు తరాలు తెలుసుకోవాలి. అయితే మా మూవీ పూర్తిగా మైథలాజికల్ జానర్లో ఉండదు. బార్బరికుడు, అతని శక్తిని ఈ తరానికి మేం చెప్పే ప్రయత్నం చేశాం. బార్బరికుడు చుట్టూకథను రాసుకోలేదు. బార్బరికుడు థీమ్ నుంచి తీసుకుని కథను అల్లుకున్నారు. ఇది నార్త్, సౌత్ అని కాకుండా ప్రతీ మనిషికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్తో తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా బార్బరిక్ చిత్రం ఉంటుంది.
నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గురించి చెప్పండి?
విజయ్ పాల్ రెడ్డి వానరా సెల్యూలాయిడ్ మీద మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా బార్బరిక్ మొదటి చిత్రం. ఇలాంటి మంచి కంటెంట్ బేస్డ్ చిత్రాలను మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది.
చిత్రీకరణలో ఛాలెంజింగ్గా అనిపించిన విషయాలు ఏంటి?
బార్బరిక్ మూవీ షూటింగ్లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్గా అనిపించేది. చాలా వరకు నైట్ షూట్స్, రెయిన్ షాట్స్ ఉంటాయి. ఈ క్రమంలో దర్శకుడు, కెమెరామెన్ చాలా కష్టపడ్డారు. ప్రతీ చిన్న డీటైలింగ్ను వదిలి పెట్టేవారు కాదు. అలా చాలా సార్లు ఎన్నో టేక్స్ చేసేవాళ్లం.
త్రిబాణధారి బార్బరిక్ ఎందుకు చూడాలంటే.. సమాధానం ఏం చెబుతారు?
సమాజంలో రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అనే వాటికి సమాధానాలు దొరకవు. కానీ మా బార్బరిక్ మూవీ వాటికి సమాధానాలు చెబుతుంది. ఓ మంచి సందేశాన్ని ఇస్తూ తీసిన మా చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ని ఎక్కడా నిరాశ పర్చదని కచ్చితంగా చెప్పగలను.