కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. నిందితులను ఓబన్న (25), గంగాధర్ (18)గా గుర్తించారు. వీరిద్దరూ కూలీ పనులు చేసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు.
జూలై 28న నటి రమ్య, తనపై ఆన్లైనులో వేధింపులకు పాల్పడుతున్నారంటూ 43 సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీని కనుగొన్నారు. అరెస్టు చేసిన వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తామే ఈ పోస్టులు పెట్టినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితులకు నటుడు దర్శన్ ఏమైనా సంబంధం ఉందా, వారు ఆయన అభిమానులా లేక వ్యక్తిగతంగానే ఈ పోస్టులు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఫిర్యాదు విషయం బయటకు తెలియగానే నిందితులు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారని, అయితే అప్పటికే తాము అవసరమైన ఆధారాలను సేకరించామని పోలీసులు స్పష్టంచేశారు.
ఈ కేసులో మరో 11 మంది అనుమానితులను గుర్తించామని, వారి కదలికలపై నిఘా ఉంచామని పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు.