Publish Date: Sat, 18 Apr 2026 (11:34 IST)
Updated Date: Sat, 18 Apr 2026 (11:45 IST)
సుస్వాగతం సినిమా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. సుమారు రూ.6కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. 16 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడింది. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్ ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. ఇంకా పవర్ స్టార్ అనే బిరుదు ఈ సినిమాతో ఆయనకు దక్కింది.
ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. 1997లో వచ్చిన తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు రీమేక్గా వచ్చిన సుస్వాగతం సినిమాలో మొదట సౌందర్య హీరోయిన్గా నటించాల్సింది. ఈ సినిమా కోసం ఆమెను సినీ యూనిట్ ముందుగా సంప్రదించింది. కానీ అప్పటికే స్టార్ హీరోయిన్గా అద్భుతమైన ఫామ్లో వున్న ఆమెతో కలిసి నటించేందుకు పవన్ సున్నితంగా తిరస్కరించారట.
గొప్పనటి అయిన సౌందర్య నటన ముందు తాను నిలబడలేనేమోననే భయంతో.. ఆమెతో పోటీపడి నటించడం కష్టమని పవన్ చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఒక వర్ధమాన నటుడిగా, సౌందర్య ప్రతిభ పట్ల పవన్కు ఉన్న అపారమైన గౌరవానికి ఇది నిదర్శనమని అప్పట్లో అందరూ ప్రశంసించారు.
ఆ తర్వాత పవన్ సూచన మేరకు దేవయానిని ఈ చిత్రంలో నటింపజేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఒకవేళ పవన్-సౌందర్య కాంబినేషన్లో ఈ సినిమా వచ్చి ఉంటే భలే వుండేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ అరుదైన కలయిక తెరపై చూడలేకపోవడం ఒక లోటుగానే మిగిలిపోయింది.