యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ''నాన్నకు ప్రేమతో'' చిత్రం తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు మలయాళ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నాడు. ఇంకా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సాయికుమార్, ఉన్ని ముకుందన్, సితార, సుహాసిని, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.
ఇప్పటివరకు తన సినిమాలను తెలుగు వరకే పరిమితం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు దక్షిణాది మొత్తం టార్గెట్ చేసి తన లేటెస్ట్ మూవీ ''జనతాగ్యారేజ్''ను భారీ ఎత్తున రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఆగస్టు 12న ఏకకాలంలో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ముందు అనుకున్నారు.
కాగా ఇప్పుడు సినిమాను మరో భాషలో కూడా రిలీజ్ చేయడానికి భావిస్తున్నారట. ఎన్టీఆర్కి జపాన్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉండడంతో జపాన్లో కూడా లిమిటెడ్ స్క్రీన్స్ లోనైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమని ఎన్టీఆర్ నిర్మాతను కోరాడట. యంగ్ టైగర్ కెరీర్లోనే మొదటిసారిగా ఒకే సినిమాను మూడు భాషల్లో రిలీజ్ చేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.