Publish Date: Mon, 06 Sep 2021 (07:56 IST)
Updated Date: Mon, 06 Sep 2021 (07:58 IST)
యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయం ఉద్ఘాటన కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్కు హామీ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అక్టోబరు-నవంబరు నెలల్లో ముహూర్తం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కొండపైన కట్టడాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన దసరాలోగా పూర్తిచేయాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) భావిస్తోంది.
ప్రారంభోత్సవం నాటికి భక్తులకు మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పనులు పూర్తిచేసేందుకు గుత్తేదారులతో సమీక్ష నిర్వహణకు యోచిస్తున్నారు. కొనసాగుతున్న పనులపై నివేదిక తయారు చేసి సీఎంకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కొండపై హరిహరుల ఆలయాల పునర్నిర్మాణంతో పాటు ఇతర కట్టడాల పూర్తికి యంత్రాంగం రెండు, మూడు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఆలయ ఉద్ఘాటనలో క్షేత్ర ప్రాధాన్యానికి తగ్గట్లు శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించడానికి కొండ కింద ఉత్తర దిశలో కేటాయించిన ప్రాంగణాన్ని తీర్చిదిద్దేందుకు యాడా సన్నాహాలు చేస్తోంది. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ యాగ నిర్వహణ జరగనుంది.