Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బులు ఇవ్వలేదని రాస్తారోకో చేసిన ఓటర్లు.. ఎక్కడ?

డబ్బులు ఇవ్వలేదని రాస్తారోకో చేసిన ఓటర్లు.. ఎక్కడ?
, గురువారం, 28 అక్టోబరు 2021 (09:43 IST)
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలను అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ తమ పార్టీల అభ్యర్థుల విజయం కోసం చేసిన ప్రచారం ఇప్పటికే ముగిసిపోయింది. 
 
ఇపుడు వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రలోభాలకు తెరలేపారు. వాస్తవానికి హుజురాబాద్‌లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది..
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట. మరికొంత మందికి మరిచారో మరి మళ్లీ వస్తారో తెలియదు. కానీ, ఈలోపే ఓటర్లు నిరసనకు దిగారు. తమకు డబ్బులు రాలేదని రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో, హుజురాబాద్ జమ్మికుంట రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులిచ్చి మరికొందరిని వదిలేశారని నినాదాలు చేస్తూ.. నిరసన తెలుపారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఇప్పుడు ఓటర్లు ఏకంగా ఆందోళనకు దిగడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. హుజురాబాద్‌లో డబ్బుల ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ గెలిచిందనీ సంబరాలు - కాశ్మీర్‌లో ముగ్గురి అరెస్టు