Publish Date: Wed, 27 Oct 2021 (08:26 IST)
Updated Date: Wed, 27 Oct 2021 (08:27 IST)
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం గత నెల రోజులుగా హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఈ ప్రచారం బుధవారం రాత్రి 7 గంటల తర్వాత ముగియనంది. మిగిలిన ఒక్కరోజు గడువులో పెద్దఎత్తున తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా కేంద్ర బలగాలు భారీ ఎత్తున రంగంలోకి దిగాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికల బందోబస్తు కోసం 17 కంపెనీల బలగాలు మాత్రమే వినియోగిస్తే.. ఒక్క హుజూరాబాద్ ఉప పోరులో 20 కంపెనీల బలగాలను ఎన్నికల కమిషన్ పంపించింది. ఈనెల 30న జరగబోయే పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పెద్దఎత్తున పారామిలటరీ బలగాలు, అదనంగా మూడు ప్లాటూన్లను ఎన్నికల కమిషన్ రంగంలోకి దింపింది.
కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని తెరాస పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిబంధనల విషయంలో ఇరు పార్టీలూ ఒకరిపైనొకరు ఫిర్యాదుల పరంపర కొనసాగించాయి. ఐదు నెలలకుపైగా సాగిన ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు ప్రదర్శించిన తీరు ఇరువరి మధ్య ప్రచ్ఛన్న యుద్దమే తలపించింది.