Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాములమ్మకు ముహూర్తం ఫిక్స్... కండువా కప్పుకోవడమే తరువాయి!

రాములమ్మకు ముహూర్తం ఫిక్స్... కండువా కప్పుకోవడమే తరువాయి!
, ఆదివారం, 8 నవంబరు 2020 (16:50 IST)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన సినీ నటి విజయశాంతి. ఈమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే, ఆ పార్టీలో ఉన్న నేతలతో ఆమెకు పొసగక... గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అదేసమయంలో బీజేపీ ఆకర్ష్ పేరుతో కమలనాథులు ఆమెకు గాలం వేశారు. ఆమెతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో బీజేపీలో చేరేందుకు ఆమె ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా సమాచారం మేరకు.. ఈ నెల 24వ తేదీలోపు ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయకండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చేయిదాటిపోయిందని విజయశాంతి కామెంట్‌ చేయడమే దీనికి సంకేతమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ ఇంకా ముందు వచ్చి ఉంటే.. కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగయ్యేదేమోనన్న ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తెరాస పార్టీ భయబ్రాంతులకు గురిచేసి నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. తెరాసకు సవాల్‌ విసిరే స్థాయికి బీజేపీ వచ్చిందని రాములమ్మ చెబుతున్నారు.
 
కాగా, రాములమ్మ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, వాస్తవానికి ఈమె బీజేపీతోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 
 
టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే విజయశాంతి స్టార్ ఇమేజ్ కలిసి వస్తుందని బీజేపీ గంపెడాశతో ఎదురు చూస్తోంది. బీజేపీ ఆశలు త్వరలోనే ఫలించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతిమంగా రాములమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ పాలన ఈ ట్రైలర్ చూస్తే చాలు... హతవిధీ : చంద్రబాబు