Publish Date: Wed, 20 Apr 2022 (09:05 IST)
Updated Date: Wed, 20 Apr 2022 (09:07 IST)
తనకు పరిచయమైన మహిళను పెళ్లి చేసుకోవాలంటూ ఓ కానిస్టేబుల్ వేధించాడు. దీంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన సంగీత (30) అనే మహిళ ఐసీడీఎస్ విభాగంలో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. ఈమెకు హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో పని చేసే సర్వేష్ యాదవ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది.
ఈ పరిచయంతో ఆమెతో చనువుగా ఉండసాగిన సర్వేష్ కాల క్రమంలో ఆమెపై మనస్సుపడ్డాడు. దీంతో తనను పెళ్ళి చేసుకోవాలంటూ వేధించ సాగాడు. అతని ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ వేధింపులు ఆగలేదు. దీంతో సంగీత బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.