Publish Date: Wed, 13 Apr 2022 (22:23 IST)
Updated Date: Wed, 13 Apr 2022 (22:26 IST)
తెలంగాణ సర్కారు రైతులకు మద్దతుగా నిలిచింది. వడ్లను సర్కారే కొనేందుకు సిద్ధం అయ్యింది. జూన్ చివరి వరకు మొత్తం కొనుగోళ్లు పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో తెలిపారు. వడ్ల కొనుగోలుకు రైతులు సహకరించాలన్న గంగుల.. వేరే రాష్ట్రంలో పండిన పంటను మన దగ్గర అమ్మకుండా జాగ్రత్త పడాలన్నారు.
వరి కొనుగోలుకు కేంద్రం సహకరించకపోయినా.. వడ్లు కొనుగోలుకు తెలంగాణ సర్కారు సిద్ధంగా వుందని ప్రకటించారు. రైతులకు నష్టం కలగకుండా ఎంఎస్పీకి కొంటామని చెప్పారు. ఒక్కో కొనుగోలు కేంద్రానికి నోడల్ ఆఫీసర్ ఉంటారని..15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమన్నారు.
ప్రస్తుతం గన్నీ బ్యాగుల కోసం జ్యూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తున్నామన్నారు. ప్రతి రైతుకు టోకెన్లు ఇచ్చి.. క్రమపద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. గోదాములు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ భవనాలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు.