Publish Date: Thu, 16 Dec 2021 (11:13 IST)
Updated Date: Thu, 16 Dec 2021 (11:15 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించే షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్ ప్రకారం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల19వ తేదీన వనపర్తి జిల్లాలో, 20వ తేదీన జనగామ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. జిల్లాల పర్యటనల నేపథ్యంలోనే ఆయా జిల్లాల టీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు.
అలాగే ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, కేడీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల 18న దళితబంధు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. దళితబంధు అమలుపై సమీక్షించనున్నారు. ఇక 20వ తేదీనే నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.