Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్ 11 తీర్మానాలు.. 33 రకాల వంటకాలు

Advertiesment
TRS plenary
, బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:11 IST)
TRS plenary
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం రోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం సుమారు పది రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.  
 
జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. 
 
జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. 
 
ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు గులాబీరంగు దుస్తులను ధరించి రావాలని ఆదేశించారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ప్రతినిధుల పేర్లు నమోదు చేసి, పాస్‌ను పరిశీలించి లోనికి అనుమతిస్తారు. 
 
కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం తర్వాత తీర్మానాలపై చర్చ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
 
ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్‌ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 
 
రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మొత్తం 22 కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది ప్రజా ప్రతినిధులు, నాయకులకు మాత్రమే పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. 
KTR
 
వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపించామని, ఆహ్వానాలు అందని వారు మన్నించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా 'బార్‌కోడ్‌'తో కూడిన పాస్‌ను ఉపయోగించి సమావేశ ప్రాంగణంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో ప్రధాన వేదికతో పాటు మరో ఐదు డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేశారు.
 
సమావేశ ప్రాంగణమంతా కేసీఆర్‌ భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 33 రకాల వంటకాలు సిద్ధం చేయడంతోపాటు హెచ్‌ఐసీసీలో వేర్వేరు చోట్ల భోజన వసతి కల్పిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదో తరగతి పరీక్షలు ప్రారంభం - నిమిషం ఆలస్యమైనా...