Publish Date: Wed, 18 May 2022 (19:05 IST)
Updated Date: Wed, 18 May 2022 (19:06 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక దళిత బంధు పథకం అమలుకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 15 వందల మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళిత బంధు ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
లబ్దిదారులను ఎంపిక చేసిన తర్వాత దశల వారీగా స్కీమ్ కింద వచ్చే సాయం అందించాలని సూచించారు. ప్రగతి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
దళిత బంధు అమలులో మరింత వేగం పెంచాలన్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పథకం అందించేవరకు దళిత బంధును కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
జూన్ 2 నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపైనా సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. సమగ్రంగా రూపొందించిన ప్రసంగ ప్రతులను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సూచించారు.
రవీంద్రభారతితో అన్ని జిల్లా కేంద్రాల్లో సాయంత్రం కవి సమ్మేళనాలు జరపాలని సూచించారు. తెలంగాణ ఘనత చాటేలా కవితలను కవులు, రచయితల నుంచి సేకరించాలన్నారు సీఎం కేసీఆర్.
ఇక వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేసిన కేసీఆర్.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.