Publish Date: Mon, 24 Oct 2022 (15:53 IST)
Updated Date: Mon, 24 Oct 2022 (15:45 IST)
సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 25వ తేదీ బుధవారం ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆలయంలో ప్రవేశం ఉండదని ప్రకటించారు. గ్రహణం కారణంగా నిత్య, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేశారు.
26వ తేదీన నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చన సైతం నిర్వహించబోమని అధికారులు ప్రకటించారు. బుధవారం సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటలకు నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని తెలిపారు.
అలాగే సూర్యగ్రహణం కారణంగా చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సైతం మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం ఉదయమే దర్శన భాగ్యం కల్పించనున్నారు.