కేసీఆర్కు పాలాభిషేకం చేస్తున్న టీటీడీపీ నేతలు : రేవంత్ రెడ్డి
ఎవరైనా ప్రజా సమస్యలపై స్టార్ హోటళ్ళలో సమావేశాలు నిర్వహిస్తారా? అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ నేతలను నిలదీశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, తన పోరాటం అంతా సీఎం కేసీఆర్పైనేనని, అందువల్ల తనను
Publish Date: Thu, 26 Oct 2017 (15:26 IST)
Updated Date: Thu, 26 Oct 2017 (16:03 IST)
ఎవరైనా ప్రజా సమస్యలపై స్టార్ హోటళ్ళలో సమావేశాలు నిర్వహిస్తారా? అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ నేతలను నిలదీశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, తన పోరాటం అంతా సీఎం కేసీఆర్పైనేనని, అందువల్ల తనను విమర్శించే వారంతా ఆయన అనుకూలురేనని చెప్పారు.
పార్టీ అధినేత చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో తనను పదవుల నుంచి తొలగించారనీ, రెండు రోజులు పదవిలో ఉంటే నేనేమైనా రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటానా? అని ఆయన మండిపడ్డారు. పైగా, తనను పదవుల నుంచి తప్పిస్తున్నట్టు చంద్రబాబు తనకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
అలాగే, టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చేలోగా పార్టీని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీని చంద్రబాబు సరిదిద్దుకోలేని విధంగా చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత అన్నీ ఆయనకు వివరిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. తనను పరుష పదజాలంతో విమర్శించినా రమణ నోరుమెదపలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.