Publish Date: Fri, 25 Mar 2022 (12:35 IST)
Updated Date: Fri, 25 Mar 2022 (12:38 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతాజీ కోసం కొత్తతరం కదలాలని పిలుపు నిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను గౌరవించకుంటే మనం భారతీయులమే కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకోజి ఆలయంలో దిక్కులేకుండా పడి ఉన్నాయని, వాటిని భారతదేశానికి తీసుకురావాలని కోరారు.
ఆ అస్థికలు నేతాజీవి అవునా.. కాదా.. అని డీఎన్ఏ పరీక్షలు చేసి తేల్చలేమా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు మూడు సార్లు ఆస్థికలు తేవడానికి ప్రయత్నించినా కుదరలేదన్నారు పవన్ కల్యాణ్. వంద రూపాయల నోట్పై నేతాజీ బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది బలిదానాల వల్లే ఈరోజు దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు.
దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లే తనకు జీవితం అంటే ఏంటో తెలిసిందన్నారు. సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని చెప్పారు. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైనవని తెలిపారు. త్రివిక్రమ్ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానన్నారు పవన్ కళ్యాణ్.