Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ ప్రజా రవాణాలో విప్లవం... ఎడ్లబండ్ల నుంచి మెట్రో దాకా.. (వీడియో)

హైదరాబాద్‌లో మెట్రో రైల్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సేవలకు పచ్చజెండా ఊపారు. ఈ సేవల ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశారు. ఈ మెట్రో రాకతో నగర ప్రజారవాణా వ్యవ

హైదరాబాద్ ప్రజా రవాణాలో విప్లవం... ఎడ్లబండ్ల నుంచి మెట్రో దాకా.. (వీడియో)
, బుధవారం, 29 నవంబరు 2017 (08:33 IST)
హైదరాబాద్‌లో మెట్రో రైల్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సేవలకు పచ్చజెండా ఊపారు. ఈ సేవల ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశారు. ఈ మెట్రో రాకతో నగర ప్రజారవాణా వ్యవస్థ మరో అంకానికి చేరింది. ఈ ప్రజా రవాణా వ్యవస్థ భాగ్యనగరంలో వృద్ధి చెందిన తీరును ఓసారి పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తొలుత ఎడ్ల బండ్లు, గుర్రపు బగ్గీలతో ప్రారంభమైంది. ఎడ్ల బండ్లను సాధారణ ప్రజలు వాడితే.. బగ్గీలను జమీందార్లు, ప్రభుత్వాధికారులు, ధనవంతులు వినియోగించేవారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మార్పులను అందింపుచ్చుకొంటూ కొత్త పుంతలు తొక్కింది. ఎడ్ల బండ్లూ, గుర్రపు బగ్గీల తర్వాత రిక్షాలు, బస్సులు, రైళ్లు, ఎంఎంటీఎస్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు మెట్రోకు స్వాగతం పలికారు. 
 
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా తొలుత నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే వ్యవస్థ ఏర్పాటైంది. 1879 నుంచి 1950 వరకు ప్రజారవాణా వ్యవస్థ నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేలో కొనసాగింది. ఆ తర్వాత నిజాం రాజులు, బ్రిటీష్ కంపెనీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రైల్వేలైన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 
 
సికింద్రాబాద్ - వాడి మధ్య రైల్వేలైన్ పనులు 1874లో పూర్తయ్యాయి. 1874 అక్టోబర్ 8న తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలు, 150 మంది ప్రయాణికులతో నిజాం సంస్థానంలో తొలిసారి పరుగుపెట్టింది. అదేరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. దీంతో స్వతంత్రంగా ఏర్పాటైన తొలి రైల్వేగా నిజాం రైల్వే రికార్డు సృష్టించింది. 
 
1884లో పూర్తిస్థాయిలో నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే ఏర్పడింది. 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని నిజాం గ్యారెంటెండ్ స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయంగా వినియోగించారు. ఇది 1930 తర్వాత పూర్తిగా హైదరాబాద్ సంస్థానం ఆధీనంలోకి వచ్చింది. 1951లో భారతీయ రైల్వే పరిధిలోకి వెళ్లింది.
 
రైల్వే వ్యవస్థ ఏర్పాటు తర్వాత నిజాం రాజులు బస్సు రవాణా వ్యవస్థపై దృష్టి సారించారు. 1932 ఏప్రిల్ 18వ తేదీన 27 బస్సులతో రవాణా మొదలైంది. 19 మంది కూర్చునేందుకు వీలుగా ఉన్న ఈ బస్సులను ఇంగ్లండ్ కంపెనీ రూపొందించింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు పరిసర గ్రామాలకు బస్సులను నడిపారు. నాటి బస్సుల్లో ఒకటైన డెక్కన్ క్వీన్ బస్సును ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఆర్టీసీ భవన్ వద్ద ఇప్పటికీ చూడవచ్చు. 
 
ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం) నగరవాసులకు ఎంతో ఊరటనిచ్చింది. 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఈ సేవలను ప్రారంభించారు. 44 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌కు రూ.178 కోట్లు ఖర్చు చేశారు. తొలిదశలో ఫలక్‌నుమా - సికింద్రాబాద్, నాంపల్లి - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - లింగంపల్లి, నాంపల్లి - లింగంపల్లి రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి. రెండో దశ పనులు కొనసాగుతున్నాయి.
 
మెట్రోరైలు ప్రారంభంతో నగర ప్రజారవాణా వ్యవస్థలో మరో మైలురాయి పడింది. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచంలోనే ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మితమైన అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. ట్రావెలింగ్ విత్ షాపింగ్ థీమ్‌తో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలను శక్తిస్వరూపిణులు అన్న మోదీ.. ఇవాంకా చప్పట్లు