Publish Date: Mon, 04 Oct 2021 (17:08 IST)
Updated Date: Mon, 04 Oct 2021 (17:09 IST)
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే విపక్ష నేతల వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారని తేలింది.
ఇద్దరు ముగ్గురు మినహా విపక్షాలకు గట్టిగా ఎవరూ కౌంటర్ ఇవ్వట్లేదట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనను కలిసిన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇదే విషయమై కేటీఆర్ చురకలంటించారని తెలిసింది. ప్రతిపక్ష పార్టీ విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీకు లేదా అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పలువురు నేతలను ప్రశ్నించినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా… ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతున్నారని కేటీఆర్ తనను కలిసిన నేతలతో అన్నారట.
చీఫ్ విప్, విప్లతో కూడా ఇవే వ్యాఖ్యలు చేసినట్టు గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలని నేతలు సూచించారు కేటీఆర్. ప్రతిపక్ష పార్టీల నిరాధార ఆరోపణలను ఎండగట్టాలన్న కేటీఆర్ సూచనలతో టీఆర్ఎస్ నేతలు మాటల దాడికి సిద్ధమవుతున్నారట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారట.
తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు చెప్పేందుకు కేటీఆర్ను కలిసిన నేతల సమస్యలు విన్న కేటీఆర్.. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై మీరంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారికి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.